Share News

World Cup: టీమిండియాకు షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ స్టార్ ఆటగాడు

ABN , First Publish Date - 2023-11-09T09:26:48+05:30 IST

India vs Netherlands: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా అందరికంటే ముందుగానే సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టు ఒక భారత్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన భారత జట్టు 16 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. ఇక లీగ్‌లో ఆదివారం జరిగే తమ చివరి మ్యాచ్‌కు టీమిండియా సిద్ధం అయింది.

World Cup: టీమిండియాకు షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ స్టార్ ఆటగాడు

బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా అందరికంటే ముందుగానే సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టు ఒక భారత్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన భారత జట్టు 16 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. ఇక లీగ్‌లో ఆదివారం జరిగే తమ చివరి మ్యాచ్‌కు టీమిండియా సిద్ధం అయింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితంతో పాయింట్ల టేబుల్‌లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేకపోయినప్పటికీ లీగ్ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా ముగించాలంటే టీమిండియా గెలవాల్సిందే. పైగా ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్యా చూస్తే నెదర్లాండ్స్‌పై టీమిండియా గెలుపు పెదగా కష్టం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశాలు కూడా లేకపోలేదు.


అయితే ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా శిబిరంలో కాస్త ఆందోళన నెలకొంది. టీమిండియా యువ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నెట్స్‌లో గాయపడ్డాడు. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో కిషన్ గాయపడ్డాడు. బుమ్రా వేసిన షార్ట్ బాల్ కిషన్ కడుపుకు బలంగా తాకింది. దీంతో తీవ్ర నొప్పితో విలవిలలాడిన ఇషాన్ కిషన్ మైదానంలో కుప్పకూలాడు. ప్రాక్టీస్ కూడా ఆపేశాడు. దీంతో టీమిండియా శిబిరంలో కాస్త ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఫిజియోథెరపీ పరీక్షించాక కొంతసమయం తర్వాత కిషన్ కోలుకున్నాడు. తిరిగి మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బుమ్రా, కిషన్‌తోపాటు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులు కూడా బుధవారం ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, షమీ, కుల్దీప్ యాదవ్ హోటల్ గదికే పరిమితమయ్యారు. కాగా ఈ ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ ఎంట్రీతో కిషన్‌కు మళ్లీ తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కిషన్‌ను ఆడించే అవాకాశాలున్నాయి.

Updated Date - 2023-11-09T09:26:52+05:30 IST