Share News

IND vs ENG: సిరాజ్ లేదా అశ్విన్.. ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా తుది జట్టు ఇదే!..

ABN , First Publish Date - 2023-10-28T16:08:08+05:30 IST

సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

IND vs ENG: సిరాజ్ లేదా అశ్విన్.. ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా తుది జట్టు ఇదే!..

లక్నో: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ఈ క్రమంలోనే టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే గాయపడిన పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కూడా ఆడడం లేదు. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో టీమిండియా తుది జట్టులో సమతుల్యం దెబ్బతింటోంది. దీంతో తుది జట్టు ఎంపిక భారత్‌కు సవాల్‌గా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీని తీసుకున్నారు. అయితే ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ లక్నో వేదికగా జరగనుంది. ఈ పిచ్‌‌పై బంతి టర్నయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరం పడొచ్చు. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు మంచి ప్రభావం చూపారు. దీంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అయితే అశ్విన్‌ను ఎవరి ప్లేసులో జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో ఆడిన షమీ 5 వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడిని ఈ మ్యాచ్‌లో తప్పించే అవకాశాలు ఉండకపోవచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్‌ను కూడా తప్పించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సూర్యను తప్పిస్తే జట్టు బ్యాటింగ్ యూనిట్ సామర్థ్యం తగ్గే అవకాశాలుంటాయి.


ఈ ప్రపంచకప్‌లో మహ్మద్ సిరాజ్ వికెట్లు తీస్తున్నప్పటికీ కాస్త పరుగులు ఎక్కువగా ఇస్తున్నాడు. దీంతో అతని స్థానంలో అశ్విన్‌ను ఆడించే అవకాశాలు లేకపోలేదు. కానీ అలా చేస్తే ఇద్దరు పేసర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఇది ఇబ్బంది కల్గించే అంశంగానే చెప్పుకోవాలి. అలా కాకుండా ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతోనే ఆడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు. ఏది ఏమైనా మ్యాచ్‌కు ముందు పిచ్‌ను పరిశీలించాక కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తుది జట్టుపై నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఆడనున్నారు. ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఏడో స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయనున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే రవిచంద్రన్ అశ్విన్ కూడా తుది జట్టులో ఉంటాడు. అప్పుడు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలలో ఒకరికే చోటు దక్కొచ్చు. ఇక పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా స్థానానికి ఢోకా లేదు. ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగితో ముగ్గురు పేసర్లకు తుది జట్టులో చోటు దక్కుతుంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్/రవిచంద్రన్ అశ్విన్

Updated Date - 2023-10-28T16:19:04+05:30 IST