IND vs AUS: ధోని 2011 వరల్డ్ కప్ ఫైనల్ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

ABN , First Publish Date - 2023-10-09T11:05:38+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ క్రీజులోకి వచ్చాడు.

IND vs AUS: ధోని 2011 వరల్డ్ కప్ ఫైనల్ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ క్రీజులోకి వచ్చాడు. జట్టును ఆదుకోవడమే కాకుండా నాలుగో వికెట్‌కు విరాట్ కోహ్లీతో కలిసి 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరలో కోహ్లీ ఔట్ అయినప్పటికీ రాహుల్ మాత్రం చివరి వరకు ఆడి జట్టును గెలిపించాడు. సిక్సుతో జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్ మొత్తంలో 115 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 8 ఫోర్లు, 2 సిక్సులతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌ల చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన టీమిండియా వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ధోని సాధించిన 91 పరుగుల రికార్డును రాహుల్ అధిగమించాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకపై వికెట్ కీపర్‌గా ద్రావిడ్ 145 పరుగులు చేశాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. స్టార్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా.. అనిపించారు. తమ అపార అనుభవంతో తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఆసీస్‌ పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌ (46), వార్నర్‌ (41), స్టార్క్‌ (28) మాత్రమే రాణించారు. జడేజాకు మూడు.. కుల్దీప్‌, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనలో భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి గెలిచింది. హాజెల్‌వుడ్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాహుల్‌ నిలిచాడు. మరోవైపు చెపాక్‌లో ఆడిన నాలుగు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో ఆసీస్‌ ఓడడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-10-09T11:06:42+05:30 IST