లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్ఐ.. ప్రెస్నోట్ విడుదల చేసిన ఏసీబీ
ABN , Publish Date - Sep 17 , 2026 | 09:25 AM
కీసర చెరువు సమీపంలో నిన్న రాత్రి వేళ ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఓ కారులో రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే.
మేడ్చల్, సెప్టెంబర్ 17: కీసర చెరువు సమీపంలో నిన్న(సెప్టెంబర్ 16)న రాత్రి వేళ ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఓ కారులో రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రెస్నోట్ను విడుదల చేసింది. గత రాత్రి11:25 గంటలకు ఏసీబీ సిటీ రేంజ్-1 యూనిట్ అధికారులు కలిసి దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి పట్టుబడ్డారని వెల్లడించింది. కీసర పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఎస్ఐను ట్రాప్ చేసినట్లు పేర్కొంది.
ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామని.. ఇన్స్పెక్టర్ సూచనల మేరకు ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది. స్టేషన్ బెయిల్, వేధింపులు లేకుండా ఉండేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు గుర్తించామని.. ఎస్ఐ వద్ద నుంచి లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశామని పేర్కొంది. ఇద్దరినీ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు..
Read Latest Telangana News And Telugu News