కోకాపేటలో రాజశ్యామల ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు యత్నం.. హరీశ్ ఆగ్రహం
ABN , Publish Date - Feb 28 , 2026 | 10:51 AM
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట్ విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు యత్నించడంపై హరీశ్ ఫైర్ అయ్యారు.
రంగారెడ్డి, ఫిబ్రవరి 28: కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం) ఉదయమే మాజీ మంత్రి ఆలయం వద్దకు చేరుకున్నారు. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చడం తప్ప మరో పని లేదని ఆయన మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారని.. ఇప్పుడు హైదరాబాద్లో శారదా పీఠం కూలుస్తున్నారని ఫైర్ అయ్యారు. మైనింగ్ కోసం సీఎం మేనల్లుడికి భూములు కేటాయించారని, సీఎం అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికాయని ఆయన అన్నారు. శారదా పీఠానికి కేటాయించిన రెండు ఎకరాలు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. రాత్రి 11 గంటలకు పోలీసులు, ఎమ్మార్వో వచ్చారని.. తాను ఉదయం 8 గంటలకే స్థలానికి చేరుకున్నానని హరీశ్ రావు చెప్పారు. తాను వచ్చేసరికి పోలీసులు, ఎమ్మార్వో, ఆర్ఐ వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ హయాంలో మఠానికి భూములు కేటాయించారనే కక్షతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. సీఎంకు దేవుడు మీద నమ్మకం లేకపోవచ్చని.. మంత్రి శ్రీధర్ బాబు అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. ఇక్కడ పూజలు చేయొద్దని పోలీసులు ఎలా ఆపుతారు అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...
కొత్త నోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం.
పులి సంచారం.. ఆవులపై దాడులు.. భయాందోళనలో ప్రజలు
Read Latest Telangana News And Telugu News