కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న జెండా ఆవిష్కరణ
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:49 PM
కొత్త రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న జెండాను ఆవిష్కరిస్తామని... అదే రోజు పార్టీ పేరును ప్రకటించనున్నట్లు కవిత వెల్లడించారు.
నిజామాబాద్, మార్చి 27: నూతన రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. మేడ్చల్లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఆడబిడ్డల్లో మార్పు తేవడానికి ఓ మహిళగా ఈ పార్టీని పెడుతున్నానని తెలిపారు. బీసీ బిల్లు సాధించడం తమ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయాలను శ్రీరాముడి స్ఫూర్తితో గమనించాలని కవిత అన్నారు. 'నేను నిజామాబాద్ బిడ్డను. ఈ మట్టి మంచిది. ఇక్కడి నుంచి తీసుకునే ఏ నిర్ణయమైనా సక్సెస్ అయింది' అన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు.. నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించలేకపోయమన్నారు కవిత. రోజు ప్రజల అవస్థలు చూశామని వ్యాఖ్యానించారు. అందుకోసమే ఓ కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అందరూ మెచ్చేలా పార్టీ ఉంటుందని, సర్వోదయ తెలంగాణ రావాలని కవిత కాంక్షించారు.
‘మేము ఎవ్వరికీ బీ పార్టీ కాము. మాది నంబర్ వన్ పార్టీ అవుతుంది. శ్రీరాముడి స్ఫూర్తితో, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని పని చేస్తాం. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 95 శాతం తెలంగాణ ప్రాంతీయ పార్టీగా, ఇంటి పార్టీగా కొత్త పార్టీ రాబోతోంది. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తా, గల్లీలో పని చేస్తా’ అని కవిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్
సైబర్ నేరగాళ్ల వలలో మాజీ ప్రొఫెసర్.. కోటి స్వాహా
Read Latest Telangana News And Telugu News