Share News

భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:16 PM

భద్రాలచంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముహూర్త సమయాన సీతమ్మను మనువాడారు రామయ్య. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
Bhadrachalam Sitarama Kalyanam

భద్రాచలం, మార్చి 27: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం(Bhadrachalam Sitarama Kalyanam) అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీసీతారాములను పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్వామివారి కల్యాణ ఘట్టం మొదలైంది. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యల శిరస్సుపై ఆలయ అర్చకులు జీలకర్ర, బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. అనంతరం తలంబ్రాల వేడుక నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇతర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.


శ్రీసీతారామయ్య కల్యాణ మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీసీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం రేవంత్ సమర్పించారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. భద్రాద్రిలో జరుగుతున్న సీతారామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి శ్రీరాముని భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియం ప్రాంగణం మార్మోగింది. సీతారాముల కల్యాణం సందర్భంగా మిథిలా స్టేడియంతో పాటు రామయ్య దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో.. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

సైబర్‌ నేరగాళ్ల వలలో మాజీ ప్రొఫెసర్.. కోటి స్వాహా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 27 , 2026 | 12:22 PM