90 మంది ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడ్డారు: బండి సంజయ్
ABN , Publish Date - Sep 16 , 2026 | 07:16 PM
బీఆర్ఎస్ హయాంలో భూకబ్జాలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. భూకబ్జాలపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు.
కరీంనగర్: బీఆర్ఎస్ హయాంలో పెద్దఎత్తున భూకబ్జాలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు లక్షల ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ భూకబ్జాలపై తాను మాట్లాడిన సమయంలో తన తలను ఆరు ముక్కలు నరుకుతానని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ను మెడలు వంచి బయటకు గుంజుకొచ్చింది తానేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమకు రావాల్సి ఉండగా తృటిలో కాంగ్రెస్ చేతికి వెళ్లిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూకబ్జాలను బయటపెట్టడానికి రేవంత్ రెడ్డికి వెయ్యి రోజులు పట్టిందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య డీల్ కుదరలేదా? ఏఐసీసీకి ఈఎంఐ కట్టడం ఇబ్బందిగా ఉందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి ఆఫర్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్లో పనిచేసిన సుమారు 90 మంది ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్, ఈ-ఫార్ములా, ఫోన్ ట్యాపింగ్, ఫామ్హౌస్ కేసుల దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. ఈ కేసులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏం చేస్తోందో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read:
కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్
‘మోదీజీ.. యూపీఐ పన్నును వెనక్కి తీసుకోండి’: రాహుల్ గాంధీ