కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:07 PM
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నారా లోకేశ్ కార్యకర్తలకు సూచించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లా: కోవూరులో టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో తనకు పలికిన స్వాగతం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో తొలి కార్యకర్తగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన బెజవాడ పాపిరెడ్డి ఉన్నారని గుర్తుచేశారు.
డబ్బులు ఎంతో మంది సంపాదిస్తారని.. అయితే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వీపీఆర్ దంపతుల్లో చూశానని లోకేశ్ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వారు రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. జిల్లాలో ఒక నాయకుడు తమ పార్టీ గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేశారని, ఇప్పుడు ఆయన ఏమయ్యారని ప్రశ్నించారు. టీడీపీ మహిళలను గౌరవిస్తుందని లోకేశ్ అన్నారు. వైఎస్ భారతి గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన టీడీపీకి చెందిన వారిని కూడా తాను జైలుకు పంపించానని చెప్పారు. కార్యకర్తే పార్టీకి అధినేత అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 45 వేల మంది కార్యకర్తలు, కోటి 60 లక్షల ఇళ్లకు ‘గడప గడపకు’ వెళ్లారని లోకేశ్ తెలిపారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తలు సమర్థంగా పూర్తి చేయాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధి అనేది జోడి ఎద్దుల బండిలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాయని అన్నారు. రాష్ట్రం పరిశ్రమలు, పెట్టుబడులకు వేదికగా మారుతోందని పేర్కొన్నారు.
ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వారు కూడా తనను ప్రశ్నిస్తున్నారని లోకేశ్ అన్నారు. ఐదేళ్ల పాటు డీఎస్సీని పట్టించుకోని వారు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. డీఎస్సీపై మాట్లాడే వారు తనతో చర్చకు రావాలని, తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వంపై జరిగే ప్రతి కుట్రను కార్యకర్తలు తిప్పికొట్టాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ చేస్తున్న ప్రతి మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
2029 ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తుందని లోకేశ్ అన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ఎన్నికల్లో గెలిస్తేనే ప్రజలకు మరింత సేవ చేయగలమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఎన్డీయే జెండా ఎగరాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ నూటికి నూరు శాతం విజయం సాధించేలా కార్యకర్తలు పనిచేయాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
Also Read:
164 వెటర్నరీ పోస్టులపై అసత్య ప్రచారాన్ని ఖండించిన పశుసంవర్ధక శాఖ
తక్షణమే కేసీఆర్కు నోటీసులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోండి.. రేవంత్ ఆదేశాలు