రాజ్యసభ స్థానాలు.. ఒకరికా? ఇద్దరికా? రేపు క్లారిటీ: మహేష్ గౌడ్
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:18 PM
నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రం నుంచి ఒకరికి ఇస్తారా? లేదా ఇద్దరికి ఇస్తారా అనేది రేపు తెలుస్తుందని ఆయన చెప్పారు.
హైదరాబాద్, మార్చి 3: రాజ్యసభ స్థానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సమర్థవంతమైన నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి ఒకరికి ఇస్తారా? లేదా ఇద్దరికి ఇస్తారా అనేది రేపు(బుధవారం) తెలుస్తుందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానం కోసం అడగడం లేదని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశాలు ఇచ్చిందని విమర్శించారు.
తెలంగాణ కోసం పనిచేసిన వారిలో ఒక్కరికైనా బీఆర్ఎస్ రాజ్యసభ ఛాన్స్ ఇచ్చిందా? అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామని, ప్రస్తుతం వాటిపై కసరత్తు జరుగుతోందని మహేష్ గౌడ్ తెలిపారు. పినరయి విజయన్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం ఇచ్చారని చెప్పారు. రాజకీయాల కోసమే విజయ్ మాట్లాడుతున్నారని, కేరళంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన వెల్లడించారు.
మావోయిస్టులు వస్తే ఆహ్వానిస్తాం..
నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పనిచేశారని టీపీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ కగార్ను తాము వ్యతిరేకించామని తెలిపారు. పాకిస్థాన్తో చర్చలకు ఒప్పుకున్న మోదీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదని విమర్శించారు. వారి సిద్ధాంతంతో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రజల కోసం పోరాడిన వారిపై గౌరవం ఉంటుందని చెప్పారు. తామైనా, మావోయిస్టులయినా పేద ప్రజల కోసమే పోరాటం చేశామని.. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు.. ఏం జరిగిందంటే
స్పోర్ట్స్ బైక్ మోజు.. ఇంటర్ విద్యార్థి మృతి
Read Latest Telangana News And Telugu News