యూట్యూబ్లో చూసి నకిలీ కరెన్సీ తయారీ
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:57 AM
నకిలీ కరెన్సీ ముద్రించి.. చలామణీ చేయబోయిన ముగ్గురు యువకులను పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
చలామణీకి యత్నం.. ముగ్గురు యువకుల అరెస్ట్
రాజేంద్రనగర్ (హైదరాబాద్ సిటీ), సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): నకిలీ కరెన్సీ ముద్రించి.. చలామణీ చేయబోయిన ముగ్గురు యువకులను పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రూ.2.91లక్షల నకిలీ కరెన్సీ, వాటి తయారీకి వాడే పేపర్ బండిళ్లు, ఇతర ముడిసరుకు, ప్రింటర్, స్కానర్ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ (టాస్క్ఫోర్స్) కేఎస్ రావు ఈ కేసు వివరాలు వెల్లడించారు. జొమాటో డెలివరీ బాయ్గా పనిచేసే రమావత్ రాము అలియాస్ మహ్మద్ (36), రమావత్ మోతీలాల్ (35), రమావత్ గాంధీ (19) స్నేహితులు. వారు నకిలీ కరెన్సీ ముద్రించి.. చలామణీ చేయాలని పథకం వేశారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో నకిలీ కరెన్సీ తయారీ వీడియోలు చూడడం మొదలుపెట్టారు. ఆ సమయంలో స్ర్కీన్పై ఒక ఫోన్ నంబర్ రావడంతో సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలర్ ప్రింటర్, స్కానర్, బాండ్ పేపర్లు, ఇతర సామగ్రి కొనాలని అవతలి వ్యక్తి సుధీర్ జాన్ చేలా అలియాస్ వంశీ చెప్పాడు. తర్వాత వారంతా కలుసుకుని అవసరమైన సామాగ్రి సమకూర్చుకున్నారు. నకిలీ కరెన్సీ తయారుచేసి రాత్రివేళల్లో వైన్ షాపులు, కూరగాయల దుకాణాల వద్ద చలామణి చేయడానికి ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారంతో శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, బాలాపూర్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వంశీ కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రక్షణ తయారీ రంగంలో భారత్ జోరు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News