రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే ‘వికసిత్ గ్రామాలు - 2047’ సాధ్యం: మంత్రి సీతక్క
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:30 PM
వీబీ జీ రామ్ జీ పథకంపై అభ్యంతరాలను కేంద్రానికి మంత్రి సీతక్క తెలియజేశారు. ఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు సీతక్క హాజరయ్యారు.
న్యూఢిల్లీ, జూన్ 29: వీబీ జీ రామ్ జీ(VB G RAM G) పథకంపై అభ్యంతరాలను కేంద్రానికి మంత్రి సీతక్క తెలియజేశారు. ఈరోజు(సోమవారం) ఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణాభివృద్ధి పథకాల అమలును జాతీయ సదస్సులో కేంద్రానికి వివరించారు. జులై 2న వీబీ జీ రామ్ జీపై తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వీబీ జీ రామ్ జీ పథకం కొనసాగించాలా లేక ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టాలా అనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. వీబీ జీ రామ్ జీ పథకం 60:40 నిధుల విధానంపై తెలంగాణకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం పెడితే కేంద్రం నిధులు ఇవ్వదని..100శాతం ఆర్థిక భారం రాష్ట్రంపై పడుతోందని వివరించారు. VB G RAM Gపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే ‘వికసిత్ గ్రామాలు–2047’ లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు.
ఎంజీఎన్ఆర్ ఈజీఎస్లో పాత 100 శాతం వేతనాల విధానమే కొనసాగించాలని సీతక్క కోరారు. మెటీరియల్ కాంపోనెంట్కు 75 శాతం కేంద్ర వాటా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త విధానం వల్ల రాష్ట్రాలపై భారీగా ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. 100 రోజుల ఉపాధి కల్పనలో తెలంగాణ.. దేశంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దనడంతో పీఎం ఆవాస్ గృహాల కేటాయింపులు లేవని.. ఇప్పుడు వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందన్నారు. తెలంగాణ నుంచి పన్నుల వాటా తీసుకుంటున్నప్పుడు కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయాలని తెలిపారు. పీఎంజీఎస్వై రోడ్లకు అటవీ అనుమతులే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని వివరించారు.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అటవీ క్లియరెన్స్పై వినతిపత్రం అందజేసినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో కూడా జాప్యం జరుగుతోందన్నారు. తరచూ అధికారుల బదిలీలతో నివేదికల సమర్పణలో ఆలస్యం జరిగిందని అన్నారు. జల్ సంచార్ విభాగంలో తెలంగాణకు 13 జాతీయ అవార్డులు వచ్చాయని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఇది మా ఇలాకా.. ఇల్లు ఎలా కట్టావ్.. గృహప్రవేశం రోజే కుటుంబంపై దాడి..
Read Latest Telangana News And Telugu News