Share News

తెలంగాణ అసెంబ్లీ.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:08 PM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు.

తెలంగాణ అసెంబ్లీ.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్
Telangana Budget Session

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Budget Session) ఈరోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో తొలిసారి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఆపై గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా(Governor Shivpratap Shukla ) ఉభయసభలను ఉద్దేశించి తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రతిపౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.


2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీకి తెలంగాణ 4.99 శాతం అందిస్తోందని తెలిపారు. ప్రపంచానికే దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని అన్నారు. ఏడాది కాలంలో సంక్షేమ ఫలితాలు అందరికీ అందేలా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని కోర్, ప్యూర్, రేర్‌గా (CORE, PURE, RARE) విభజించామని, హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించామని గవర్నర్ తెలిపారు.


హిల్డ్ పాలసీ ద్వారా పరిశ్రమల భూముల బదలాయింపు చేపట్టామని గవర్నర్ తెలిపారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించేందుకు నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు రచిస్తున్నామని, తొలి దశలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీసరోవర్ వరకు అభివృద్ధి చేపడతామని ఆయన చెప్పారు. మూసీలో మురుగు నీరు చేరకుండా 39 STPలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఓఆర్‌ఆర్(ORR) మాదిరిగా రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఏర్పాటు చేయబోతున్నామని గవర్నర్ తెలిపారు. పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలకు తరలించాలని నిర్ణయించామని గవర్నర్ తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ(MSME) పార్క్‌లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.


తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5 లక్షల 72 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌కు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపడతామని వివరించారు. బుల్లెట్ రైళ్లకు శంషాబాద్ కేంద్రంగా మారబోతోందన్నారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని గవర్నర్ వెల్లడించారు.


ఇల్లులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 4లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9వేల కోట్లు అందించామని చెప్పారు. ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోందని గవర్నర్ వెల్లడించారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరాయన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి రేర్ నమూనా రూపొందించామని తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అమలుకు 99 రోజుల కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రజావానికి వచ్చిన 64,697 పిటిషన్లలో 47,670 పరిష్కరించామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.


సభలో బీఆర్‌ఎస్ నిరసన

శాసనసభలో బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.


ఇవి కూడా చదవండి...

హనుమాన్ మాలతో స్కూల్‌కు విద్యార్థులు.. అడ్డుకున్న యాజమాన్యం

అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధతపై పోరాడుతాం: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 12:50 PM