తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం
ABN , Publish Date - Sep 06 , 2026 | 07:08 AM
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో శాస్త్రీయంగా చేపట్టిన కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 3.55 కోట్ల మంది ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా సేకరించామన్నారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ ఎత్తేయాలి: కొప్పుల రాజు
తెలంగాణ మాదిరి కులగణనకు బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని ఒప్పించాలి: మంత్రి పొన్నం
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో శాస్త్రీయంగా చేపట్టిన కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 3.55 కోట్ల మంది ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా సేకరించామన్నారు. బీసీలకు న్యాయమైన వాటా దక్కాలంటే శాస్త్రీయ కులగణన అత్యవసరమని, దీనికోసమే ఏఐసీసీ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని వెల్లడించారు. శనివారం గాంధీభవన్లో మీడియాతో సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు ఓబీసీ కుల సంఘాలతో మాట్లాడి 134 ఓబీసీ కులాలను గుర్తించి కులగణన జరిపామని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం సోషియో ఎకానమిక్ సర్వే చేసినప్పుడు 46 లక్షల కులాలు, ఉప కులాలు వచ్చాయని, ఇప్పుడు చేసేది కచ్చితమైన ఓబీసీ జనగణన కాదన్నారు. డిజిటల్ యాప్ ద్వారా నిర్వహించే ఈ జనగణనలో ముందే క్యాటగిరీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్), ఆ తర్వాత ధ్రువీకరించిన కులం పేరు ఉండేలా డ్రాప్-డౌన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో 50 శాతమున్న జనాభా వద్ద కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉందన్న ఆయన.. సరైన గణాంకాలు బయటకు వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేసేందుకు మార్గం సుమగమవుతుందన్నారు. ఈ విషయమై గత ఐదేళ్లుగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ సర్వే మోడల్ను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ 100 రోజుల ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు.
ఏఐసీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం: పొన్నం
ఏఐసీసీ చేపట్టిన ఈ 100 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేస్తామని పొన్నం అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో ఓబీసీ కులగణన చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ, ఆ తర్వాత మాట తప్పారని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ మోడల్ను ప్రాతిపదికగా తీసుకుని జాతీయ కులగణనపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, నేతలు చొరవ చూపాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జడ్జీల కొరతతో కొండలా పెరిగిన కేసులు
సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News