Share News

తెలంగాణలో 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష..

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:50 PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. విడుదలైన ఖైదీలు సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా సూచించారు.

తెలంగాణలో 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష..
Telangana 91 Prisoners Released

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. ఖైదీలు ఇవాళ జైళ్ల నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా వెల్లడించారు. విడుదలవుతున్న ఖైదీలు సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, మళ్లీ జైలు బాట పట్టకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆమె సూచించారు.


విడుదల అవుతున్న వారిలో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 38 మంది జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి ఆసక్తి చూపినట్లు డీజీ తెలిపారు. వారికి ఇవాళే నియామక పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. మిగిలిన 53 మంది వ్యవసాయం, స్వయం ఉపాధి రంగాల్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారని, వారికి కూడా అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించారు. అలాగే విడుదల అవుతున్న మహిళా ఖైదీల్లో నలుగురికి కుట్టు మిషన్లు అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.


విడుదల పొందిన వారు బాధ్యతాయుతంగా జీవించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటే.. జైళ్ల శాఖ చేసిన కృషి ఫలించినట్లవుతుందని సౌమ్యా మిశ్రా పేర్కొన్నారు. గత ఏడాది కొత్త ప్రభుత్వం 213 మంది ఖైదీల విడుదలకు అనుమతి ఇవ్వగా, ఈసారి మరో 91 మందికి క్షమాభిక్ష మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం, అర్హులైన ఖైదీలకు ఏడాదిలో మూడు సార్లు క్షమాభిక్ష ఆధారంగా విడుదల అవకాశాలు కల్పించే విధానాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు.


Also Read:

మహిళతో మాటలు కలిపి.. అకస్మాత్తుగా చెయిన్ లాక్కెళ్లిన దుండగుడు

99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష

For More Latest News

Updated Date - Jun 02 , 2026 | 04:55 PM