Share News

ఉద్యోగులపై వివక్ష ఎందుకు?

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:59 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగులకు పీఆర్‌సీ, డీఏలు వస్తాయని, సమస్యలు తీరుతాయని ఆశించామని, కానీ.. రాష్ట్రం ఏర్పాటు కాగానే సమస్యలు మొదలయ్యాయని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగులపై వివక్ష ఎందుకు?
lachi reddy

  • ఉద్యమించి తెలంగాణ తెచ్చుకోవడమే తప్పా?

  • ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్సీ, డీఏలు పెండింగ్‌ లేవు

  • ప్రత్యేక రాష్ట్రంలో ఎందుకున్నాయో చెప్పాలి

  • ఉద్యోగుల జేఏసీ సంకల్ప సభలో వి.లచ్చిరెడ్డి

  • ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం

  • ఈహెచ్‌ఎస్ అమలులో రాజీపడబోం: భట్టి

  • పోలీసులు అక్రమ అరెస్టులు ఆపాలి

  • రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగుల తీర్మానం

  • సీపీఎస్‌ రద్దు చేయాలి: స్థితప్రజ్ఞ

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగులకు పీఆర్‌సీ, డీఏలు వస్తాయని, సమస్యలు తీరుతాయని ఆశించామని, కానీ.. రాష్ట్రం ఏర్పాటు కాగానే సమస్యలు మొదలయ్యాయని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్‌సీ, డీఏలు పెండింగ్‌లో లేవని, స్వరాష్ట్రంలో ఎందుకున్నాయో ప్రభుత్వం చెప్పాలని అన్నారు. సకల జనుల సమ్మె చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడమే తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగడంలేదని, ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పీఆర్‌సీ, డీఏ ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందంటూ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులపైనే వివక్ష, చిన్నచూపు ఎందుకు? అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యం లో నిర్వహించిన సంకల్పసభలో లచ్చిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఉద్యోగులతో పలుమార్లు చర్చలు జరిపి హామీలిచ్చారని గుర్తుచేశారు. ఆ హామీలనే అమలు చేయాలని తాము కోరుతున్నామని చెప్పారు. పీఆర్‌సీ నివేదిక తెప్పించుకొని అమలు చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి జూన్‌ 2న ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదని తెలిపారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే, ప్రభుత్వాన్ని అడిగే హక్కు, స్వేచ్ఛ ఉద్యోగులకు వచ్చాయని తెలిపారు. అయితే ఆరోగ్య పథకం అమలులో తలెత్తే లోపాలను పరిష్కరించడానికి ఉన్నతాధికారులు చొరవ చూపడంలేదని విమర్శించారు. ప్రభుత్వానికి మంచిపేరు తేవడంలో ఉద్యోగులు ఉపయోగపడతారని అన్నారు.


ప్రభుత్వాన్ని బెదిరించడంలేదు

ప్రభుత్వాన్ని తాము బెదిరించడం లేదని, ఉద్యోగుల విషయం లో మానవీయ కోణంలో ఆలోచించాల్సిందిగా కోరుతున్నామని లచ్చిరెడ్డి తెలిపారు. పదవీ విరమణ సమయంలో రావాల్సిన డబ్బులు రాకపోతే ఆ ఉద్యోగి పడే మానసిక వేదను అర్థం చేసుకోవాలని కోరారు. రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కొందరు ఉన్నతాధికారులు తప్పుడు సలహాలతో తొలగించారని, వారి కుటుంబాల పరిస్థితేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం హామీ ఇచ్చినమేరకు సీపీఎ్‌సను రద్దుచేసి, ఓపీఎస్‌ను తీసుకురావాలని, వెంటనే పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ, ఓపీఎస్‌, డీఏలతోపాటు మరో 42 సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జేఏసీ పోరాటం చేస్తుందని లచ్చిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి వోడ్నాల రాజశేఖర్‌, నాయకులు ఎస్‌ రాములు, మహిపాల్‌రెడ్డి, నిర్మల, రాధ, ఉద్యోగులు పాల్గొన్నారు.


ఉద్యోగుల జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవీ

  • పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలు వెంటనే విడుదల చేయాలి

  • సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

  • 2004కు ముందు నియామకమైన వారికి ఓపీఎస్‌ అమలుచేయాలి

  • పెండింగ్‌ బిల్లులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను తక్షణమే చెల్లించాలి

  • ప్రతినెలా రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలి

  • జీవో నం. 317, జీవో నం. 25 సమస్యలను పరిష్కరించాలి

  • వయస్సు 61+వీఆర్‌ఏలకు జీవో నెంబరు- 81 అమలు చేయాలి

  • కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి అసెంబ్లీ

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 04:59 AM