Share News

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

ABN , Publish Date - May 07 , 2026 | 02:59 PM

రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రిపీటెడ్‌గా డ్రగ్స్ కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ తరహా చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం తొలిసారిగా ఈగల్ ఫోర్స్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు.

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
TG DGP CV Anand

హైదరాబాద్, మే 07: రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రిపీటెడ్‌గా డ్రగ్స్ కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ తరహా చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం తొలిసారిగా ఈగల్ ఫోర్స్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నార్కోటిక్స్‌పై అలర్ట్‌గా ఉన్నామని.. డ్రగ్స్ కట్టడి చేయడంలో మొదటి ప్రాధాన్యతతో ఉన్నామన్నారు.


రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్‌పై ఈ సమీక్షలో చర్చించామని వివరించారు. ఈగల్ ఫోర్స్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆపరేషన్‌లు నిర్వహించడం ద్వారా నిందితులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. డ్రగ్స్ విషయంలో సరఫరాతోపాటు డిమాండ్.. ఈ రెండింటిపై దృష్టి సారించామని పేర్కొన్నారు.


ఈగల్‌లో సిబ్బంది కొరత ఉందన్నారు. సివిల్ ఫోర్స్ అవసరం కూడా ఉందని చెప్పారు. డ్రగ్స్ సప్లయర్స్ ఆస్తులను సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. జిల్లాలో కమిషనర్లు, ఎస్పీలు కూడా డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో నిఘా లోపించిందని ఈ సమీక్షా ద్వారా బహిర్గతమైందని చెప్పారు. నార్కోటిక్ ఐదు పోలీస్ స్టేషన్‌లు మంచిగా పని చేసి, ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.


ఇక నుంచి యూనివర్సిటీలతోపాటు విద్యాసంస్థల్లో డ్రగ్స్ దొరికితే ఆ బాధ్యత యజమాన్యాలదేనని డీజీపీ సీవీ ఆనంద్ కుండబద్దలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాల్లో అధికారులు డ్రగ్స్ కేసుల దర్యాప్తు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. జిల్లాల్లో డ్రగ్స్ కేసుల విచారణపై అధికారులకు ఈగల్ ఫోర్స్ ద్వారా శిక్షణ ఇస్తామని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2026 | 03:06 PM