‘మల్లన్నసాగర్-ఘన్పూర్’కు సర్కారు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:34 AM
మూసీ నది పునరుజ్జీవానికి కీలకమైన ‘గోదావరి తాగునీటి సరఫరా’ పథకం పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2,
3లో రూ.7360 కోట్లతో పనులు
మూసీ పునరుజ్జీవంలో భాగంగా
జంట జలాశయాలకు గోదారి నీరు
బ్యాంకు రుణం వచ్చే వరకు
‘మేఘా’ నిధులతో పనులు
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి
15 దాకా చేయూత పింఛన్ల దరఖాస్తులు
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మూసీ నది పునరుజ్జీవానికి కీలకమైన ‘గోదావరి తాగునీటి సరఫరా’ పథకం పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్కు గోదావరి జలాలను తరలించి ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలను నింపే గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2, 3లో ప్యాకేజీ-1 పనుల ప్రారంభానికి అనుమతి ఇస్తూ సోమవారం పురపాలక శాఖ జీవో జారీ చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.7360 కోట్లు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో చేపట్టే ఈ పనుల్లో ప్రభుత్వం 40 శాతం, ఏజెన్సీ 60 శాతం పెట్టుబడి పెట్టేలా నిర్ణయించింది. ప్యాకేజీ-1 పనులను ఎల్-1 బిడ్డర్గా ఎంపికైన మేఘా సంస్థకు అప్పగించారు. మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3000 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పైప్లైన్ను రెండు వరసల్లో నిర్మించనున్నారు. ఒక్కో లైన్ ద్వారా 10 టీఎంసీల చొప్పున నీటిని తరలించనున్నారు. మల్లన్నసాగర్లో పంప్హౌస్, విద్యుత్తు పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ నిర్మాణంతోపాటు ఘన్పూర్లో 1170 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం, 40 ఎంఎల్ సామర్థ్యంతో క్లియర్ వాటర్ జలాశయం కమ్ పంప్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు.
రుణం ఆలస్యమైతే.. సొంత నిధులతో పనులు
ప్రాజెక్టు కోసం కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా సంస్థ ఎస్పీవీని ఏర్పాటు చేసింది. మల్లన్నసాగర్ వాటర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు అమలుకు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ రుణ మంజూరు ప్రక్రియ జాప్యం అవుతోంది. ఈ క్రమంలో పనులు ఆలస్యమవకుండా చూసేందుకు మేఘా సంస్థ సొంత నిధులతో పనులు చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతించింది.
ఇవి కూడా చదవండి
ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్టర్న్ వర్సిటీ క్యాంపస్
అధికారిక ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫొటో ఔట్