అధికారిక ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫొటో ఔట్
ABN , Publish Date - Sep 01 , 2026 | 03:59 AM
రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అధికారులు మంత్రి కొండా సురేఖ ఫొటోను పెట్టలేదు.
శిలాఫలకాల్లోనూ లేని మంత్రి పేరు
మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి
పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో
పాల్గొనని కొండా సురేఖ
ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం
ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ
కేసముద్రం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అధికారులు మంత్రి కొండా సురేఖ ఫొటోను పెట్టలేదు. శిలాఫలకంపై ఆమె పేరును కూడా రాయలేదు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క.. కేసముద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించడంతోపాటు మునిసిపాలిటీ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఈ సభావేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ప్రభుత్వ విప్, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఫొటోలను కూడా ముద్రించారు. కానీ, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అయిన కొండా సురేఖ ఫొటోను మాత్రం పెట్టలేదు. పైగా, ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ హాజరు కాకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి!