భూగర్భ గనులను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదు: సింగరేణి యాజమాన్యం
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:08 PM
సింగరేణికి చెందిన భూగర్భ గనులను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 02: సంస్థకు చెందిన భూగర్భ గనులను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. సంస్థకు చెందిన భూగర్భ గనుల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బుధవారం యాజమాన్యం ఖండించింది. ప్రస్తుతం 21 భూగర్భ, 17 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రత కోసం భూగర్భ గనులను కొనసాగిస్తామని పేర్కొంది.
గనులు మూసివేయడం, ప్రైవేటు పరం చేయడం తమ లక్ష్యం కాదని సింగరేణి యాజమాన్యం ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టింది. ఉత్పత్తి పెంచి, నిర్వహణ వ్యయాలు తగ్గించి గనులను లాభాల్లోకి తీసుకురావడమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యమని యాజమాన్యం వెల్లడించింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శాంతిఖని గనిపై Expression of Interest (EOI) కేవలం పైలట్ అధ్యయనం కోసమేనని వివరించింది.
మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ (ఎండీఓ ) విధానంతో ఖర్చులు, నష్టాలు తగ్గుతాయా? అనే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. శాంతిఖని ఈఓఐ ఆధారంగా ప్రైవేటీకరణ ప్రచారం వాస్తవ విరుద్ధమని పేర్కొంది. సంస్థలోని ఉద్యోగులు, వారి కుటుంబాల్లో అనవసర ఆందోళన కలిగించే వార్తలను ప్రచారం చేయొద్దంటూ సింగరేణి విజ్ఞప్తి చేసింది. శాంతిఖని ఈఓఐకి స్పందన రాకపోవడంతో ఈ ప్రక్రియను సింగరేణి విరమించుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
ఇందిరాభవన్కు మహేశ్ గౌడ్, మీనాక్షి.. సురేఖ అంశం చర్చించే ఛాన్స్ ఉందన్న టీపీసీసీ చీఫ్
Read Latest Telangana News And Telugu News