కోఠి ఏటీఎం వద్ద కాల్పులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:58 PM
కోఠి కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పుల అనంతరం దుండగులు కాచిగూడ వైపు పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, జనవరి 31: హైదరాబాద్లోని కోఠి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిన్షద్పై రెండు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు.. ఆరు లక్షల రూపాయలు దోచుకెళ్లారు. అయితే ఓ బుల్లెట్ రిన్షద్ కాలిలోకి దూసుకెళ్లగా, మరో బుల్లెట్ ఆచూకీ లభించలేదు. రెండో బుల్లెట్ కోసం ఘటనాస్థలిలో క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టింది. ఏటీఎం సెంటర్ వద్ద రిన్షద్పై కాల్పులు జరిపిన దుండగులు.. బాధితుడి ద్విచక్రవాహనంపైనే పారిపోయారు.
కాల్పులు జరిపిన అనంతరం ఇద్దరు నిందితులు ఎటు వెళ్లారనే దానిపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో నిందితులు కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. స్టేషన్ వద్ద బాధితుడి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. కాచిగూడ సమీపంలోని డీమార్ట్ దగ్గరికి వెళ్లిన దుండగులు.. అక్కడే ఓ ప్రార్థనా మందిరం వద్ద బట్టలు మార్చుకుని, ఆపై రైల్వేస్టేషన్ వద్ద టూవీలర్ను వదిలేసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం.. దుండగులు ఏ దుస్తుల్లో వెళ్లారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి దర్యాప్తు బృందాలు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి పారిపోయారా? లేక ఏదైనా బస్సులో ఎక్కి పారిపోయారా? అనే కోణంలో సీసీటీవీ కెమరాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. దుండగులను పట్టుకునేందుకు మొత్తం ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి
విషాదం.. రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News