Share News

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయం

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:57 AM

ప్రైవేట్‌ రంగంలోని ఉద్యోగాలను అందిపుచ్చకోవడానికి సరైన అవకాశాలు లేవని, అందుకోసం మంత్రి ఉత్తమ్‌ జాబ్‌మేళాను ఏర్పాటు చేశారని తెలిపారు. తనను రెండుసార్లు ఎంపీగా గెలిపించడంలో ఉత్తమ్‌ దంపతులు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయం
Kodada job fair 2026

  • నేను ఎంపీగా గెలవడంలో ఉత్తమ్‌ దంపతులది కీలక పాత్ర: గుత్తా

  • యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి: గడ్డం ప్రసాద్‌

  • నా ప్రజాజీవితంలో బాధపెట్టింది నిరుద్యోగ సమస్యే: ఉత్తమ్‌

  • కోదాడలో ఉత్తమ్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా

  • 3,500 మందికి నియామక పత్రాలు

సూర్యాపేట, సెప్టెంబరు 19, (ఆంధ్ర జ్యోతి): నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మంత్రి ఉత్తమ్‌ జాబ్‌మేళా ఏర్పాటు చేయడం అభినందనీయం అని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళా ప్రారంభోత్సవానికి శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రి ఉత్తమ్‌, జాబ్‌ మేళా ఆర్గనైజింగ్‌ చైర్మన్‌, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సుఖేందర్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ, ప్రభుత్వరంగంలో 11 లక్షల ఉద్యోగాలున్నాయని, ప్రైవేట్‌ రంగంలో లక్షలాది ఉద్యోగాలు ఉంటాయన్నారు. ప్రైవేట్‌ రంగంలోని ఉద్యోగాలను అందిపుచ్చకోవడానికి సరైన అవకాశాలు లేవని, అందుకోసం మంత్రి ఉత్తమ్‌ జాబ్‌మేళాను ఏర్పాటు చేశారని తెలిపారు. తనను రెండుసార్లు ఎంపీగా గెలిపించడంలో ఉత్తమ్‌ దంపతులు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.


యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని విదేశీయులతో పోటీపడాలని గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లలో 60వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఇంకా పలు నోటిఫికేషన్ల ద్వారా మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల జీవితాల్లో జాబ్‌మేళా కొత్త అధ్యయానికి నాందిపలుకుతోందన్నారు. నైపుణ్యాలు కలిగిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎలాంటి రాజకీయ ఉద్దేశం, వ్యక్తిగత స్వార్థం లేకుండా ఉత్తమ్‌, ఎమ్మెల్యే పద్మావతి మెగా జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కలిగిన కంపెనీలతో పాటు రాష్ట్రంలోని 350 కంపెనీలు జాబ్‌మేళాకు హాజరై ఉద్యోగాలు కల్పించడం సంతోషదాయకమన్నారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ, దేశంలోనే కోదాడలో నిర్వహించిన విధంగా జాబ్‌మేళా ఎక్కడా నిర్వహించలేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ఉత్తమ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నామన్నారు. తన 32 ఏళ్ల ప్రజా జీవితంలో అత్యంత బాధ కలిగించినది నిరుద్యోగ సమస్య అని ఉత్తమ్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎంతో కష్టపడి, లక్షల్లో డబ్బు ఖర్చు చేసి వారి పిల్లలను చదివిస్తున్నారని.. ఆ పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడంతో వారు చాలా నిరుత్సాహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేసి 350 కంపెనీలను కోదాడ జాబ్‌మేళాకు రప్పించినట్లు స్పష్టం చేశారు.


జాబ్‌మేళా ద్వారా 5,625 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని, అందులో కొందరికి ఉద్యోగ నియామక పత్రాలు అందించగా, మరికొందరిని ఆయా కంపెనీలు వారి కంపెనీల వద్దకు రావాలని, అక్కడ చివరి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పాయని వెల్లడించారు. కాగా జాబ్‌మేళాకు 30వేలకు పైగా అభ్యర్థులొచ్చారు. తమ విద్యార్హత, నైపుణ్యాలకు సరిపోయే కంపెనీల వద్ద ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. జాబ్‌మేళాకు ప్రముఖ ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో పాటు పలు సాఫ్ట్‌వేర్‌, నిర్మాణరంగం, ఫార్మా, సిమెంట్‌ కంపెనీలతో పాటు 350 కంపెనీలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా అభ్యర్థులను ఇంటర్వ్హూలు చేసి 5,625 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. అందులో 3,500 మంఇ అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మిగిలిన వారిని చివరి ఇంటర్వ్యూలకు వారి కంపెనీలకు రావాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దానంపై తీర్పు రాజ్యాంగ విజయం
అటవీ భూములకు.. మీరెలా పట్టాలిస్తారు?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:57 AM