కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:49 PM
నందినగర్లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆన్ కెమెరా విచారణ జరుగుతోంది. అయితే, సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశానని.. ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని.. అలాగే ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశామని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు మాజీ ముఖ్యమంతి. ఇప్పుడు ఇదే గదిలో విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.
కాగా.. నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను ఐదుగురు సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. భవనంలోని రెండో ఫ్లోర్లో విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి, స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేసీఆర్ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్ట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎర్రవల్లి ఫామ్హౌస్ నుంచి నందినగర్కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ను ప్రశ్నిస్తున్న సిట్..
Read Latest Telangana News And Telugu News