వెలుగుమట్ల బాధితుల సమస్యపై కవిత ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:24 AM
వెలుగుమట్ల బాధితుల పట్ల ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్, మార్చి 10: భూదాన్ భూములు అంటేనే పేద వాళ్ళకు ఇచ్చినవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్లో నిరాహారదీక్ష చేసిన కవితను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వెలుగుమట్ల ఇళ్లు కూలగొట్టి అధికారులు కర్కశంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాధితులను అంబేద్కర్ భవన్లో ఉంచారని.. బాధితుల పట్ల ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ నేత విశారదన్తో కలిసి ఉద్యమించామని కవిత అన్నారు.
నిరవధిక దీక్షకు దిగితే తాను టెర్రరిస్ట్ అయినట్లు అరెస్ట్ చేశారని ఫైర్ అయిన కవిత.. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. పెద్ద వాళ్లకు భూములు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. కూలగొట్టిన చోటే వాళ్ళకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ.. వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
ఒక్కరి తప్పు ఉంటే అందరి ఇళ్ళు కూల్చుతారా అని ప్రశ్నించారు. బాధితుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలు ఉన్నారని... వారు పరీక్షలు ఎలా రాయాలని నిలదీశారు. ‘కలెక్టర్కు బాధ్యత ఉందా.. ముగ్గురు మంత్రులకు ఇది కనపడటం లేదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం అధికారం ఉందని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చుతారని ప్రశ్నించారు. అవసరం అయితే కోర్టులో పిల్ వేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద వాళ్ళ పట్ల లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందంటూ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ మద్యం స్కాం రౌజ్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే
డేటింగ్ యాప్లో పరిచయం.. స్నేహమంటూ దగ్గరై 51 ఏళ్ల వ్యక్తిని
Read Latest Telangana News And Telugu News