‘22ఏ’ను రద్దు చేయకపోతే అసెంబ్లీని నడవనివ్వం
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:31 AM
రైతు ఏడిస్తే రాజ్యాలు కూలిపోతాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.
రైతు ఏడిస్తే రాజ్యాలు కూలిపోతాయి
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
సిద్దిపేట క్రైం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రైతు ఏడిస్తే రాజ్యాలు కూలిపోతాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. రాష్ట్రంలో భూములను నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టడంతో 50 లక్షల మంది బాధపడుతున్నారని, రైతుల భూముల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోందని విమర్శించారు. 22ఏను రద్దు చేయకపోతే అసెంబ్లీని నడవనివ్వబోమని హెచ్చరించారు. సోమవారం ఆయన సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట 22ఏ రద్దు కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. ప్రభుత్వ భూములను కాంగ్రెస్ సర్కారు 30 శాతం కమిషన్తో అమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు. వందలాది మంది రైతులు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇంటికి వచ్చి తమ భూములు కాపాడాలని వేడుకుంటున్నారని తెలిపారు. 22ఏ విషయంలో తప్పు చేశామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఒప్పుకున్నారని, దీనికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, న్యాయ విచారణ చేయించాలని కోరారు. బీజేపీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భూములను అమ్మి డబ్బును ఢిల్లీకి తీసుకెళుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. ఏ దరఖాస్తులు పెట్టారని సీఎం, మంత్రుల భూములను 22ఏ నుంచి తొలగించారని ప్రశ్నించారు. భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రె్సను నిషేధించాలన్నారు. 22ఏతో రైతులు తమ భూములను అవసరానికి అమ్ముకోకుండా చేశారని, ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా అత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు, ‘ధరణి’లో జరిగిన స్కాంలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి