విదేశీ రోగుల కోసం 400 పడకలు
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:53 AM
వైద్య చికిత్స కోసం రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ రోగులను సర్కారీ దవాఖానాలకు వచ్చేలా ఆకర్షించేందుకు సర్కారు దృష్టి సారించింది. వారి కోసం హైదరాబాద్లో 400 పడకలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఒక్కో టిమ్స్లో వంద..
నిమ్స్లో మరో వంద
ఇంటీరియర్, ఇతర వసతుల
బాధ్యత టీజీఎంఎ్సఐడీసీకి..
వైద్య టూరిజంపై సర్కార్ దృష్టి
హైదరాబాద్ వచ్చే మెడికల్
టూరి్స్టలపై అధ్యయనం
ఒక్కో టిమ్స్లో వంద.. నిమ్స్లో మరో వంద
హైదరాబాద్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): వైద్య చికిత్స కోసం రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ రోగులను సర్కారీ దవాఖానాలకు వచ్చేలా ఆకర్షించేందుకు సర్కారు దృష్టి సారించింది. వారి కోసం హైదరాబాద్లో 400 పడకలను అందుబాటులోకి తీసుకురానుంది. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్లలో ఒక్కోచోట వందేసి పడకలు, నిమ్స్ ఆస్పత్రిలో మరో 100 పడకలు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. ఫారిన్ మెడికల్ టూరిస్టులను ఆకర్షించాలంటే ఉన్నత వైద్య ప్రమాణాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, పారదర్శకమైన సేవలు, ప్రచారం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ప్రమాణాలపై సర్కారు దృష్టి సారించింది. ఆస్పత్రులకు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జేసీఐ) గుర్తింపు ఉందా లేదా అని విదేశీ రోగులు చూస్తారు. కొన్ని నెలల్లోనే ఈ గుర్తింపు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ గుర్తింపుపైనా దృష్టి సారించింది. సౌకర్యాల విషయానికొస్తే సనత్ నగర్ టిమ్స్లో ఇంటరీయర్ డిజైన్స్, ఇంటర్నల్ స్ట్రక్చర్స్, హైఫై ఫర్నిచర్ ఏర్పాటు బాధ్యతను టీజీఎంఎ్సఐడీసీకి అప్పగించారు. ప్రత్యేక వార్డులు, ప్రైవేటురూంలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్కు వచ్చే విదేశీ రోగులు ముఖ్యంగా అపోలో, యశోద, ఏఐజీ, కాంటినెంటల్ వంటి ఆస్పత్రులకు వెళుతున్నారు. దీంతో ఆ ఆస్పత్రులు వారి కోసం ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నాయి? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయనే అంశాలపై వైద్య శాఖ అధికారులు అధ్యయనం చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జాతీయ, అంతర్జాతీయ రోగుల వైద్య చికిత్సలకు గమ్యస్థానంగా మారింది. ఏటా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 8-10 లక్షల మంది, విదేశాల నుంచి మరో 2 లక్షల మంది వరకు రాష్ట్ర రాజధానికి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ టూరిజం సొసైటీ (టీజీఎంటీఎస్) ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న మెడికల్ వాల్యూ టూరిజం(ఎంవీటీ)ని మరింత బలోపేతం చేయనుంది. ఎంవీటీలో పది రకాల శాఖలు అంతర్భాగంగా ఉంటాయని, అవి సమన్వయంతో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. టీజీఎంటీఎస్, ఎంవీటీ కలసి విదేశీ రోగుల కోసం విధానాలు రూపొందించనున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒక విదేశీ రోగి విమానాశ్రయంలో దిగగానే పికప్ చేసుకోవడం నుంచి తిరిగి వెళ్లేవరకు అవసరమైన సేవలుఅందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీనికి నోడల్ అధికారులను ఏర్పాటు చేయనున్నారు.రిజిస్ట్రేషన్, క్యాష్లెస్, కరెన్సీ ఎక్స్చేంజ్ చెల్లింపులు సులభంగా జరగడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంతోపాటు విదేశీ భాషలు మాట్లాడగలిగేఅనువాదకులనుఅందుబాటులో ఉంచే అవకాశాలను సర్కారు పరిశీలిస్తోంది. వైద్యులు, నర్సులు, సిబ్బందికి విదేశీ రోగుల సంస్కృతి, ఇంగ్లిషుపై పట్టు కోసం శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
మజ్లిస్ అదుపులోనే రహ్మత్ బేగ్!
ప్రజల ఆశీస్సులకు అనుగుణంగా పాలన