మీరు చేసిన తప్పులకి ప్రజలకు ఎందుకు శిక్ష.. పొంగులేటిపై హరీశ్ ఫైర్
ABN , Publish Date - Aug 18 , 2026 | 01:30 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు.
మల్కాజిగిరి, ఆగస్టు 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు. రాత్రికి రాత్రే కాలనీల్లో ప్రభుత్వం అమ్మిన భూములు, హెచ్ఎండీఏ అమ్మిన భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారని మండిపడ్డారు. ‘మీరు చేసిన తప్పులకి ప్రజలకు ఎందుకు శిక్ష? పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు నా చేతిలోకి రావాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు తప్పు చేశారు.. సారీ అని పొంగులేటి చెప్తే సరిపోతుందా? ఇది 30% గవర్నమెంట్... ఏ పని కావాలన్నా 30% కమీషన్ అడుగుతున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి ఇల్లు నిషేధిత జాబితాలో ఉందని.. మరి సీఎం ఎక్కడ మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నారో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. పొంగులేటి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిషేధిత భూములతో పాటు ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములను కాజేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నిషేధిత జాబితాల నుంచి తొలగించిన భూముల లిస్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి కలిసి కుట్ర చేస్తున్నారని.. తప్పు వారు చేసి అధికారులపై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అధికారులూ జాగ్రత్త.. మీరు తప్పు చేస్తే రేపు మీరే బలవుతారు. మీ కమీషన్ల కోసం పెన్ను పోటుతో ప్రజల జీవితాలను బలి చేయొద్దు. రేపు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా నిషేధిత భూములపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తుంది.. ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజల ఆస్తులపై మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే పాతర వేస్తారు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ పనిచేయట్లేదు... మీ జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటుంది’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు
జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన
Read Latest AP News And Telugu News