1100 ఎకరాల భూసేకరణ.. బుల్లెట్ రైల్ పనుల వేగవంతం
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:49 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బుల్లెట్ రైల్ కారిడార్తోపాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం భారీ భూసేకరణ చేపట్టింది. రైల్వే కారిడార్ ప్రాజెక్టు కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహుదూర్గూడలో భూములను సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
తొలుత 796.28 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ
తగిన పరిహారం ఇవ్వాలంటున్న స్థానిక రైతులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బుల్లెట్ రైల్ కారిడార్తోపాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం భారీ భూసేకరణ చేపట్టింది. రైల్వే కారిడార్ ప్రాజెక్టు కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహుదూర్గూడలో భూములను సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ముంబయి, బెంగళూరు, చెన్నైలకు నేరుగా వెళ్లే బుల్లెట్ రైళ్ల కోసం ఇక్కడ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములకు ఇటీవల కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని స్థానిక రైతులు తీవ్రంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు హైకోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఫ్రభుత్వం మరింత భూమి సేకరించాలని నిర్ణయించింది. బుల్లెట్ రైల్ కారిడార్తోపాటు మెట్రో, బస్ టర్నినల్ ఇతర మౌలిక సదుపాయాల కోసం దాదాపు 1100 ఎకరాల వరకు సేకరించనుంది. ఇంటిగ్రేటెడ్ మెబిలిటీ హబ్ పేరుతో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు బుధవారం బహదూర్గూడలో 796.28 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సమీపంలోని రాయకుంట, కొంగరకుర్ధు, సయ్యద్గూడలో కూడా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. కాగా బహదూర్గూడలో 796.28 ఎకరాల భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్లో 146.28 ఎకరాలు ప్రైవేటు భూమి కాగా మిగతా 650 ఎకరాలు ప్రభుత్వ భూమి. సర్వేనంబరు 28లో 150 ఎకరాలు, సర్వేనంబరు 62లో 500 ఎకరాల ఫ్రభుత్వ భూములు ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎవరూ కూడా ఈ భూములకు సంబంధించిన లావాదేవీలు, అభివృద్ధి పనులు నిర్వహించడానికి వీల్లేదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ఈ భూమిలోకి వెళ్లి సర్వే చేయడానికి అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొంది. కాగా, బహదూర్గూడలోని సర్వేనంబరు 28, 62లోని 650 ఎకరాల ప్రభుత్వ భూములను కొందరు స్థానికులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. తమకు తగిన పరిహారం చెల్లించిన తరువాతనే వాటిని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను ఈ రైతులు అడ్డుకున్నారు. దీంతో కొన్నిరోజులపాటు ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి 500 గజాల చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీన్ని మరింత పెంచాలని రైతులు కోరుతున్నారు. కాగా, తాజా నోటిఫికేషన్పై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోపు లిఖితపూర్వకంగా తెలపవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
హ్యామ్ రోడ్లకు హడ్కో రుణం
టీవీ9 షేర్ల బదిలీ కేసులో రవి ప్రకాశ్కు నిరాశ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News