ఉగాది రోజున ఘనంగా గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:45 PM
హైదరాబాద్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాగాయకుడు గద్దర్ కళల ద్వారా సమాజానికి తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడని కొనియాడారు డిప్యూటీ సీఎం.
హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) సచివాలయంలో గద్దర్ అవార్డుల జ్యూరీ సభ్యులతో డిప్యూటీ సీఎం కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అన్ని భాషల సినీ పరిశ్రమలు ఇక్కడికి విస్తరించేలా అనుకూల వాతావరణం కల్పిస్తామన్నారు. దీని ద్వారా సినీ రంగంలో యువత, టెక్నీషియన్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. సినీ ప్రపంచ మార్కెట్కు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని వెల్లడించారు.
కళల ద్వారా సమాజానికి తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడు ప్రజా గాయకుడు గద్దర్ అని అన్నారు. అందుకే గద్దర్ పేరు మీద సినిమా అవార్డులను ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే అవార్డులు ఇవ్వాలని జ్యూరీ సభ్యులకు సూచించారు. ఉగాది రోజు మార్చి 19న ఘనంగా అవార్డుల పంపిణీ జరగనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఫిబ్రవరి 6 నుంచి గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి..
నా భార్య, పిల్లలు ఎందుకు చనిపోయారో తెలియడం లేదు: సురేందర్ రెడ్డి ఆవేదన
నాన్న ఆదేశాలతో అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం: బాలకృష్ణ
Read Latest Telangana News And Telugu News