శంషాబాద్ విమానాశ్రయంలో రూ.30 కోట్ల రోలెక్స్ వాచ్లు స్వాధీనం..
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:08 PM
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ అక్రమంగా తరలిస్తున్న రోలెక్స్ వాచ్లను సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. మెుత్తం 30 ఖరీదైన రోలెక్స్ వాచ్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం, డ్రగ్స్, గంజాయి వంటివి తరచుగా దొరకడం కలకలం సృష్టిస్తోంది. రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయల విలువైన అక్రమ వస్తువులను అధికారులు పట్టుకుంటున్నారు. పటిష్ఠ తనిఖీలు చేస్తున్న ఎయిర్పోర్ట్ అధికారులు.. నిందితుల నుంచి వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజాగా ఇవాళ(గురువారం) అక్రమంగా తరలిస్తున్న రోలెక్స్ వాచ్లను సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. మెుత్తం 30 ఖరీదైన రోలెక్స్ వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.18 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటిని హైదరాబాద్ నుంచి ముంబైకి ఇద్దరు ప్రయాణికులు తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
మరోవైపు నిన్న(బుధవారం) బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్లైన్స్ టీజీ-329 విమానంలో శంషాబాద్కు వచ్చిన 14 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన మోసిన్ బహదూర్ అనే వ్యక్తి బ్యాంకాక్ వెళ్లి తిరుగు ప్రయాణంలో గంజాయి తెచ్చినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.14 కోట్లు ఉంటుందని తెలిపారు. గంజాయిని వివిధ రకాల వస్తువుల్లో రహస్యంగా దాచి తరలించినట్లు అధికారులు చెప్పారు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా విషయం బయటపడినట్లు చెప్పారు.
అలాగే వారం రోజుల కిందట శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గత మంగళవారం నాడు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 24.45 కిలోల హైడ్రోపోనిక్(గాంజా)ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు. దాని విలువ దాదాపు రూ.8.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు
పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు