కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణకు ముప్పుగా మారింది: సీఎం రేవంత్
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:52 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టగా మిగిలిన నగదుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
హైదరాబాద్, ఆగస్టు18: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టగా మిగిలిన నగదుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. మంగళవారం హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2029లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు.
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ జరిగితే 117 సీట్లతో అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం అయితే.. ఆయన కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యారని.. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్క, వాకిటి శ్రీహరి మంత్రులయ్యారని సోదాహరణంగా ఆయన వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉద్యమకారులకు కీలక పదవులు ఇచ్చామని వివరించారు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలికి పదవులిచ్చామని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఎర్రబెల్లి, వినోద్రావుకు పదవులిచ్చారని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్ సీఎం అయితే.. వారి కుటుంబ సభ్యులకు ఫామ్హౌజ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.
అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని వివరించారు. దిశ బాగుంటుందని కేసీఆర్ కొత్త సచివాలయం కట్టుకున్నారని తెలిపారు. కానీ కేసీఆర్ దిశ, దశ బాగా లేదు.. అందుకే తాను, భట్టి విక్రమార్క సచివాలయంలో ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీల లెక్కలు తేల్చిన తొలి ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు.
పాపన్న పోరాటం అద్భుతం: సీఎం రేవంత్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం అద్భుతమని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అమరవీరుల స్తూపానికి ఉన్న ప్రాధాన్యతే పాపన్న విగ్రహానికి ఉండాలని స్పష్టం చేశారు. చరిత్రను చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డామని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!
డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి
For More TG News And Telugu News