తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:19 PM
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. మూసీ పేరిట దోపిడీకి తాము వ్యతిరేకమని.. మూసీకి కాదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly) ప్రశ్నోత్తరాల్లో భాగంగా మూసీ నది ప్రాజెక్ట్పై తీవ్ర చర్చ జరిగింది. మూసీ పేరిట దోపిడీ జరుగుతోందంటూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ‘మూసీ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు.. ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం. ఆ దోపిడీకి నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. డీపీఆర్ లేదని ఎండీ చెప్పారని, కానీ ప్రభుత్వం ఉందని చెబుతోందని ఆరోపించారు. పేదవాళ్లపై ప్రేమను ఒలకబోస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చేశారంటూ మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ‘డీపీఆర్ తయారైందని ఎండీ నరసింహారెడ్డి స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ సత్యదూరమైన మాటలు చెబుతున్నారు. మూసీపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు’ అని మంత్రి ఆరోపించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ‘వెలుగుమట్లపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెలుగుమట్లపై దమ్ముంటే చర్చకు రావాలి’ అంటూ సవాలు విసిరారు. అసలు విషయాలన్నీ తెలిస్తే కేటీఆర్ సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. సర్కార్పై కేటీఆర్ ప్రశ్నల వర్షం
ప్రచార ఆర్భాటాలు చేసి వదిలేసే ప్రభుత్వం మాది కాదు: డిప్యూటీ సీఎం భట్టి
Read Latest Telangana News And Telugu News