డ్రగ్స్ కేసు.. పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Mar 17 , 2026 | 09:47 AM
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో రోహిత్కు పార్టీ అధిష్ఠానం నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్, మార్చి 17: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి(Pilot Rohith Reddy) బీఆర్ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. రోహిత్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ అధిష్ఠానం. డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘డ్రగ్స్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్ కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు’ నోటీసుల్లో పేర్కొంది.
ఈ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ ఆదేశించింది. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ ఆదేశించింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్ఠానం హెచ్చరించింది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో మార్చి 14న జరిగిన డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో కొకైన్తో సహా డ్రగ్స్ సీజ్ చేశారు. పార్టీలో ఉన్న రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మతో సహా పలువురికి నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే పోలీసులను చూసిన వెంటనే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాల్లో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి..
మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్
హైదరాబాద్ మియాపూర్లో ప్రైవేట్ మినీ బస్ బోల్తా
Read Latest Telangana News And Telugu News