డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: శ్రీలంకతో రెండో టెస్టు డ్రా అయితే.. భారత్ పరిస్థితేంటి?
ABN , Publish Date - Aug 26 , 2026 | 08:08 PM
శ్రీలంకతో సిరీస్ వర్షం కారణంగా డ్రాగా ముగిస్తే.. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువగా కనిపిస్తోంది. అయితే కొలంబోలో వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 503/9 వద్ద డిక్లేర్ చేయగా.. శ్రీలంక 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా ఫాలో ఆన్ ఆడించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) పోరాడటంతో శ్రీలంక కొంత పుంజుకుంది. ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 53.33 శాతంతో ఐదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఓడిపోవడంతో భారత్కు నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం వచ్చింది. శ్రీలంక సిరీస్లో విజయం సాధిస్తే టీమిండియా నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. రెండో టెస్టు డ్రాగా ముగిస్తే.. భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతుంది. టీమిండియా 53.33 నుంచి 51.52 శాతానికి పడిపోతుంది. అంటే శ్రీలంకపై విజయం సాధించడం భారత్కు కేవలం సిరీస్ గెలుపు మాత్రమే కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కీలకమైన పాయింట్లను సాధించేందుకు కూడా అత్యంత కీలకం కానుంది.
తదుపరి ప్రణాళిక ఇదే..
శ్రీలంకతో రెండో టెస్టు అనంతరం భారత్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో మరో ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఆడిన 10 టెస్టుల్లో భారత్ నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో మిగిలిన ప్రతి టెస్టు దాదాపు నాకౌట్ మ్యాచ్లా మారింది. శ్రీలంక సిరీస్ తర్వాత భారత్ నవంబర్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది ఐపీఎల్కు ముందు ఆస్ట్రేలియాకు ఆతిథ్యమివ్వనున్న భారత్.. ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆడుతుంది. దీంతో ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్కు కీలకమైన మ్యాచ్లు ముందున్నాయి.
ఫైనల్ చేరాలంటే..?
బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియాకు ఎదురైన అనూహ్య పరాజయంతో భారత్కు కొంత ఊరట లభించినప్పటికీ.. ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా శ్రమించాల్సిందే. మిగిలిన టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిగిలిన ఏడు టెస్టుల్లో ప్రతి మ్యాచ్ను గెలిచేలా చూసుకోవాలి. అన్ని మిగిలిన మ్యాచ్ల్లో గెలిస్తే భారత్ PCT గణనీయంగా పెరుగుతుంది. మొత్తం ఎనిమిది టెస్టుల లెక్కలో ఏడు విజయాలు, ఒక ఓటమి ఉంటే PCT 68.52 శాతానికి చేరుతుంది. అదే ఆరు విజయాలు, రెండు ఓటములు అయితే PCT 62.96 శాతానికి పడిపోతుంది.
ఇవి కూడా చదవండి:
భారత్-శ్రీలంక రెండో టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట
పంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీలంక బ్యాటర్ను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్!