డబ్బు కంటే గౌరవమే ముఖ్యం: వైభవ్ తండ్రి సంజీవ్
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:00 AM
రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ సూర్యవంశీ వైభవ్.. టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరగనున్న టీ20 మ్యాచుల్లో వైభవ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ తండ్రి సంజీవ్ తన కుమారుడి క్రికెట్ జర్నీని గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: దేశం తరఫున ఆడాలన్న యువ క్రికెటర్, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ కల నెరవేరింది. ఇటీవల ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్తో పాటు భారత సీనియర్ టీ20 జట్టు (ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన)కు ఎంపికైన బిహారీ కుర్రాడిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తన కుమారుడు జాతీయ జట్టుకు ఎంపిక కావడంపై వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జాతీయ జట్టుకు ఎంపికయ్యే వరకు వైభవ్ పడిన కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
'చిన్నప్పటి నుంచే భారత జట్టుకు ఆడాలనే బలమైన లక్ష్యంతో వైభవ్ కష్టపడ్డాడు. అతడిలోని ఆ పట్టుదల చూసి, పూర్వీకుల భూమిని అమ్మి మరీ శిక్షణ ఇప్పించాను' అని సంజీవ్ పేర్కొన్నారు. అతడు ఇప్పటివరకు తన కొడుకని, నేటి నుంచి దేశానికి బిడ్డ అని గర్వంగా చెప్పారు. తమకు డబ్బు కంటే దేశం తరఫున ఆడి.. తెచ్చే గౌరవమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. వైభవ్ జాతీయ జట్టుకు ఎంపికైన బీసీసీఐ నుంచి తమకు పత్రాలు వచ్చాయని, తాము ఇంగ్లండ్ వెళ్తున్నామని సంజీవ్ పేర్కొన్నారు. కేవలం 15 ఏళ్లకే సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమిస్తూ టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో వైభవ్ కుటుంబంలో, అతడి స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్రెడ్డి
కిషన్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం