Share News

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్ ఓటమి.. సెమీస్‌కు భారత్

ABN , Publish Date - Feb 01 , 2026 | 08:57 PM

అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్ ఓటమి.. సెమీస్‌కు భారత్
Under 19 World Cup

ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్‌తో తీవ్రంగా నిరాశపర్చిన టీమిండియా కెప్టెన్ ఆయుశ్ మాత్రే.. బౌలింగ్‌లో అదరహో అనిపించాడు. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా టోర్నీలో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది.


భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని పాక్ 33.3 ఓవర్లలోపు ఛేదిస్తే ఆ జట్టు ఇండియా నెట్‌రన్‌రేట్‌ను అధిగమించి సెమీ ఫైనల్‌కు చేరేది. కానీ, లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 33.3 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేసింది. భారత బౌలర్లు సరైన సమయంలో రాణించి.. పాక్‌ను కట్టడి చేశారు. గ్రూప్‌-1 నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌ సెమీస్‌ చేరాయి. గ్రూప్‌-2లో ఇంగ్లాండ్‌ బెర్తు ఖాయం చేసుకుంది.


పాకిస్థాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(66) అర్థ శతకంతో రాణించగా.. జహూర్(42), ఫర్హాన్ యూసఫ్(38) పర్వాలేదనిపించారు. హుజైఫా అసాన్(14) విఫలమయ్యారు. వీరు మినహా ఇతర బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఆయుశ్ మాత్రే, ఖిలాన్ పటేల్ చెరో 3, అంబిరిష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్ర తలొక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ

భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ

Updated Date - Feb 01 , 2026 | 09:01 PM