ధోని లేకుండా సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ విజయాలు సాధించలేరు.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 08:38 PM
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఈ జట్టు.. గతేడాది నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్పై టీమిండియా మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఈ జట్టు.. గతేడాది నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తూ వస్తోంది. ఐపీఎల్ 2025లో పాయింట్ల పట్టికలో సీఎస్కే ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అదే తీరును కొనసాగిస్తూ ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా సాధించలేక అట్టడుగు స్థానంలోనే ఉంది. సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని గాయం కారణంగా మైదానంలోకి దిగకపోవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్పై టీమిండియా మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
2009లో ఫ్లెమింగ్ సీఎస్కే కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన నేతృత్వంలోనే చెన్నై ఐదుసార్లు టైటిల్ దక్కించుకుంది. అయితే ఆ ట్రోఫీలన్నీ ధోని నాయకత్వంలోనే రావడం గమనార్హం. 2024లో సీఎస్కే కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జట్టు ప్రదర్శన దారుణంగా పడిపోయిందని విమర్శలు వస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో రమేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
‘ధోని లేకుండా ఫ్లెమింగ్ ఎక్కడా విజయాన్ని సాధించలేదు. ఆయన విజయాలు పూర్తిగా ధోనిపైనే ఆధారపడి ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ప్రస్తుతం క్రికెట్ చాలా వేగంగా మారుతోంది. ఆటగాళ్ల ఫిట్నెస్ను ఎలా విశ్లేషిస్తామో.. కోచ్ల పనితీరును కూడా అలాగే పరిశీలించాలి. కానీ ఫ్లెమింగ్ మాత్రం ఆధునిక ఆట తీరుకు తగ్గట్టు మారలేకపోతున్నారు. ఆయన ఇంకా ఐదు అడుగులు వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తున్నారు’ అని రమేశ్ విశ్లేషించాడు.
అలా చేస్తేనే...
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్పైన కూడా సదాగోపన్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లో కేవలం 41 పరుగులు మాత్రమే చేయడం నిరాశ కలిగించిందన్నారు. ‘ఫోర్లు, సిక్సర్లు కొట్టేందుకు అనుభవం అవసరం లేదు. కానీ బౌండరీలను అడ్డుకోవడానికి మాత్రం అనుభవం కావాలి. సీఎస్కే బౌలింగ్లో అదే లోపిస్తోంది. కెప్టెన్గా రాణించాలంటే గైక్వాడ్ ముందుగా బ్యాటింగ్లో రన్స్ చేయాలి. తానే మ్యాచ్లు గెలిపిస్తే అతనిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి’ అని సూచించాడు.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య