Share News

అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:30 PM

అజింక్య రహానె రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి అంటూ ప్రశంసించాడు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె గురువారం ఓ వీడియోను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్
Sachin Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: అజింక్య రహానె రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి అంటూ ప్రశంసించాడు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె గురువారం ఓ వీడియోను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత, మాజీ క్రికెటర్లు రహానె రిటైర్‌మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జట్టుకు అతడు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.


‘మనం ముంబయి జట్టు తరఫున తొలిసారి బ్యాటింగ్ చేసినప్పుడు.. అవకాశాల కోసం ఎన్నడూ వెంటపడని ఒక వ్యక్తిని నేను అప్పుడే చూశా. జట్టు కోసం కష్టపడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నందువల్లే అవకాశాలు నీ దగ్గరికి వచ్చేవి. ఆ లక్షణమే ఆస్ట్రేలియాలో అత్యుత్తమ క్షణాలను నీకు అందించింది. సంయమనం దూకుడుకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని నువ్వు నిరూపించావు. కంగ్రాట్స్ రహానె’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.


‘మనం ఎన్నో సంవత్సరాలు కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకున్నాం. నువ్వు సాధించిన ప్రతి విజయానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నీ కమిట్‌మెంట్‌, ప్రొఫెషనలిజం ఎప్పుడూ నిన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. జీవితంలో కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు’ అంటూ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎక్స్‌లో పోస్టు చేశాడు.


రహానె టెస్టుల్లో 85 మ్యాచ్‌లు ఆడి 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 90 మ్యాచ్‌ల్లో 2,962 పరుగులు, మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు నమోదు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 20 మ్యాచ్‌ల్లో 375 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా కూడా రహానె ప్రత్యేక గుర్తింపు పొందాడు. అతడి నాయకత్వంలో భారత్ నాలుగు టెస్టుల్లో విజయం సాధించగా, రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెల్‌బోర్న్ టెస్టులో జట్టును అద్భుతంగా పుంజుకునేలా చేయడంతో పాటు, గబ్బాలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి సిరీస్‌ను 2-1తో భారత్ ఖాతాలో వేసిన ఘనత కూడా రహానె నాయకత్వానికే దక్కింది. 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై సాధించిన కీలక టెస్టు విజయంలోనూ అతడు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: పట్టుదలే పతకమైంది.. డిస్కస్ త్రోలో సీమా కళిరామన్‌కు కాంస్యం

దులీప్ ట్రోఫీ.. వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ ఎలా చేశారు?: హర్షా భోగ్లే

Updated Date - Jul 31 , 2026 | 12:33 PM