కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:12 PM
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్.. సీమింగ్ పరిస్థితుల్లో సచిన్ కంటే కోహ్లీనే గొప్ప అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్.. సీమింగ్ పరిస్థితుల్లో సచిన్ కంటే కోహ్లీనే గొప్ప అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని చెప్పాడు. సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ప్లేయర్ల గణాంకాలను పరిశీలిస్తే వారి అసలు సామర్థ్యం తెలుస్తుందని చోప్రా వెల్లడించాడు.
‘సేనా దేశాల్లోనే ప్లేయర్ల అసలు సత్తా తెలుస్తుంది. సచిన్ 63 మ్యాచ్ల్లో 5,387 పరుగులు చేశాడు. అతడి సగటు 51.30. 17 సెంచరీలు, 23 అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లీ 48 మ్యాచ్ల్లో 3,781 పరుగులు చేశాడు. అతడి సగటు 41.54. సెంచరీలను పక్కనపెట్టినా సగటులో గణనీయమైన తేడా ఉంది. అయితే దక్షిణాఫ్రికాలో మాత్రం కోహ్లీ సచిన్ను అధిగమించాడు. అక్కడ సచిన్ 15 టెస్టుల్లో 1,161 పరుగులు చేసి 46.44 సగటుతో కొనసాగగా.. ఐదు సెంచరీలు సాధించాడు. కోహ్లీ తొమ్మిది మ్యాచ్ల్లో 49.50 సగటుతో 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా పిచ్పై బ్యాటింగ్ చేయడం సులువైన విషయం కాదు. అక్కడ అందరి సగటూ పడిపోతుంది. సచిన్ సగటు కూడా 46.44కి తగ్గింది. కానీ కోహ్లీ అక్కడ 49.50 సగటుతో సచిన్ను అధిగమించాడు. సచిన్పై కోహ్లీ పైచేయి సాధించిన ఏకైక దేశం ఇదే. కానీ మిగతా మూడు దేశాల్లో సచిన్దే ఆధిపత్యం. దీనిబట్టి నా అభిప్రాయం ప్రకారం.. సచినే గొప్ప’ అని చోప్రా వివరించాడు.
ఇవి కూడా చదవండి:
డీఆర్ఎస్ తీసుకోవాలని బంగ్లాను రెచ్చగొట్టిన స్మిత్.. అంపైర్ వార్నింగ్
పరాజయాలను పతనంగా చూడొద్దు.. భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదు: గంభీర్