Share News

జపాన్ ఓపెన్ టోర్నీ: సెమీస్‌కు సింధు.. ఎలాంటి పోటీ లేకుండానే..

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:45 AM

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. టోక్యోలో శుక్రవారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహారా గాయం కారణంగా వైదొలిగింది.

జపాన్ ఓపెన్ టోర్నీ: సెమీస్‌కు సింధు.. ఎలాంటి పోటీ లేకుండానే..
PV Sindhu

ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. టోక్యోలో శుక్రవారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహారా గాయం కారణంగా వైదొలిగింది. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే సింధు సెమీ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె.. సెమీస్‌లో చైనా ప్రపంచ నాలుగో ర్యాంకర్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ యూఫీతో తలపడనుంది.


ఈ సీజన్‌లో సింధుకు ఇది మూడో సెమీఫైనల్. అంతకుముందు మలేషియా సూపర్-1000, ఆస్ట్రేలియా సూపర్-500 టోర్నీల్లోనూ సెమీస్‌కు అర్హత సాధించింది. 2023 డెన్మార్క్ ఓపెన్ తర్వాత తొలిసారి సూపర్-750 స్థాయి టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం. సింధు-చెన్ యూఫీ మధ్య ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరగగా.. చెన్ 8-6 ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా గత ఐదు వరుస మ్యాచ్‌ల్లో సింధు ఓటమిపాలైంది. ఈసారి విజయం సాధిస్తే ఆ పరాజయాల పరంపరకు తెరపడటమే కాకుండా దాదాపు మూడేళ్ల తర్వాత సూపర్-750 టోర్నీ ఫైనల్‌లోకి అడుగుపెట్టిన ఘనతను సొంతం చేసుకోనుంది. అంతకుముందు ప్రీక్వార్టర్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యీ (చైనా)పై సింధు 21-16, 21-14 తేడాతో కేవలం 35 నిమిషాల్లోనే విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

గెలిచి..నిలిచిన ఇంగ్లండ్‌

వరల్డ్‌ నెం.5కి సింధు షాక్‌

Updated Date - Jul 17 , 2026 | 11:45 AM