ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:24 PM
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఎ, శ్రీలంక ఎ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య(32) విచిత్రమైన రీతిలో రనౌట్ అయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఎ, శ్రీలంక ఎ జట్లు తలపడుతున్నాయి. భారత యువ జట్టుకు శుభారంభం దక్కలేదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(14), విధ్వంసకర బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్(2) స్పల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్ జట్టును గాడీలో పెట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రియాంశ్ ఆర్య(32) విచిత్రమైన రీతిలో రనౌట్ అయ్యాడు. శ్రీలంక ఎ వికెట్ కీపర్ కాలు కింద బ్యాట్ చిక్కుకోవడంతో ప్రియాంశ్ క్రీజు చేరలేకపోయాడు. దీంతో అంపైర్ రనౌట్ అని ప్రకటించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
13వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ లాంగాఫ్ వైపు బంతిని ఆడాడు. మరో ఎండ్లో ఉన్న ప్రియాంశ్ ఆర్యను రెండో పరుగు కోసం అలర్ట్ చేశాడు. మొదట అంగీకరించిన ప్రియాంశ్ తర్వాత సందిగ్ధంలో పడ్డాడు. చివరకు ఇద్దరూ ఒకే ఎండ్కు చేరుకోవడంతో తిరిగి క్రీజ్లోకి రావడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా కాలు కింద ప్రియాంశ్ బ్యాట్ ఇరుక్కుపోయింది. దీంతో క్రీజ్ను చేరుకునేలోపే రనౌట్ అయ్యాడు. రీప్లేలో ప్రియాంశ్ బ్యాట్ వికెట్ కీపర్ కాలు కింద చిక్కుకున్న విషయం స్పష్టంగా కనిపించింది. థర్డ్ అంపైర్ దానిని పరిగణనలోకి తీసుకోకుండా ఔట్గా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బ్యాట్ కీపర్ కాలు కిందకి వెళ్లకుండా ఉంటే ప్రియాంశ్ ముందుగానే క్రీజ్లోకి చేరేవాడని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ప్రియాంశ్ ఆర్య రనౌట్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ట్రై సిరీస్: నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ
మద్యం మత్తులో ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. స్టోక్స్ కెప్టెన్సీకి ముప్పు?