శ్రీలంకతో టెస్టులో కోహ్లీ ఉంటే ఫలితం మరోలా ఉండేది: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:48 PM
శ్రీలంకతో టెస్టు సిరీస్ డ్రాగా ముగియడంతో టీమిండియాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ చివరి రోజు భారత ఆటగాళ్లలో కనిపించిన నిరుత్సాహం తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో టెస్టు సిరీస్ డ్రాగా ముగియడంతో టీమిండియాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసిన భారత్.. ఫాలో ఆన్లో శ్రీలంకను కట్టడి చేయలేకపోయింది. దీంతో 1-0తో సిరీస్ను డ్రాగా ముగించింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ చివరి రోజు భారత ఆటగాళ్లలో కనిపించిన నిరుత్సాహం తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ జట్టులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
‘బాస్.. టెస్టు క్రికెట్ ఆడటం అంత సులువైన విషయం కాదు. ఇది సుదీర్ఘమైన ఆట. నిరంతరం బౌలింగ్ చేస్తూనే ఉండాలి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే.. పదే పదే అరుస్తూ జట్టును అప్రమత్తంగా ఉంచేవాడు. కానీ మనం కొన్ని సందర్భాల్లో జట్టును పట్టించుకోలేదు. బౌలర్లు బౌలింగ్ చేస్తుంటే ఏదో ఒక సమయంలో వికెట్ వస్తుందిలే అనుకున్నాం. బంతి బాగా టర్న్ అవుతోంది కాబట్టి వికెట్లు వాటంతట అవే వస్తాయని భావించాం. కానీ రాలేదు. ఫలితంగా సిరీస్ డ్రా అయింది. రెండో టెస్టులో భారత ఆటగాళ్లలో శక్తి, ఉత్సాహం తక్కువగా కనిపించాయి. అందుకే చెబుతున్నాను.. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అతడు ‘కమ్ ఆన్ రాహుల్.. కమ్ ఆన్ జైస్వాల్’ అంటూ ఆటగాళ్లను ఉత్సాహపరిచేవాడు. సోనల్ దినుషాపై కూడా ఒత్తిడి తెచ్చేవాడు’ అని కైఫ్ చెప్పాడు.
దినుషానే అసలు టార్గెట్ కావాలి..
‘మనం లంక ప్లేయర్ లాహిరు కుమారతో గొడవ పడ్డాం. కానీ మనం అసలు ఔట్ చేయాల్సిన ఆటగాడు దినుషా. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడిలోనూ కనిపించలేదు. ‘వాళ్ల ముఖాలు చూడండి’ అంటూ కుమారాతో వాళ్ల భాషలో అతడు ఏదో మాట్లాడుతున్న వీడియో కూడా చూశాను. దినుషా బ్యాటింగ్లో ఉన్న ఆత్మవిశ్వాసం చూస్తే అతడిపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టమవుతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఆటగాళ్లు మీ ముందు నిలబడి మిమ్మల్ని చూస్తేనే ఒత్తిడి మొదలవుతుంది. అలాంటి పెద్ద ఆటగాడు వచ్చి ప్రత్యర్థిని అస్థిరపరిచే ప్రయత్నం చేయాలి. ఈ టెస్టులో ఆ అంశాన్ని కూడా మనం మిస్సయ్యాం’ అని కైఫ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
లక్ష చెట్లకు రాఖీలు.. ప్రకృతి పరిరక్షణకు జార్ఖండ్ ప్రజల కంకణం!
సెప్టెంబరు 1 నుంచి దానాపూర్ - బెంగళూరు రైలు