షెడ్యూల్ ప్రకారమే లీగ్.. ఆ వార్తల్లో నిజం లేదు: ఐపీఎల్
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:25 AM
ఐపీఎల్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే పలువురు విదేశీ క్రికెటర్లు ఇంకా తమ జట్లతో చేరలేదు. దీంతో ఐపీఎల్ను వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఐపీఎల్ వర్గాలు స్పందించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే పలువురు విదేశీ క్రికెటర్లు ఇంకా తమ జట్లతో చేరలేదు. కొంతమంది గాయాలపాలవ్వడం, మరికొందరు వర్క్లోడ్ కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమవుతారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై క్రికెట్ మాజీలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ అవుతోంది. విదేశీ క్రికెటర్లు జట్లతో చేరాల్సి ఉండటంతో ఐపీఎల్ను వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఐపీఎల్ వర్గాలు స్పందించాయి.
పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం 20 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే విదేశీ క్రికెటర్ల కోసం లీగ్ను ఆపలేమని ఐపీఎల్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రణాళిక ప్రకారమే మార్చి 28న టోర్నీ ప్రారంభం అవుతుందని.. సీజన్ మొత్తం జరుగుతుందని వెల్లడించాయి. విదేశీ ఆటగాళ్ల విషయం ఫ్రాంచైజీలే చూసుకుంటాయని ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘మెగా లీగ్లో విదేశీ క్రికెటర్లు ఆడే విషయంలో ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. ఇందులో మేం చేసేదేమీ లేదు. కొందరు గాయాల కారణంగా ఇంకా తమ జట్లతో చేరలేదు. మరికొందరు వర్క్లోడ్తో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. వారి లభ్యతను ఫ్రాంచైజీలే చూసుకుంటాయి. ఐపీఎల్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. పూర్తిస్థాయిలో అభిమానులు హాజరై ఆస్వాదించేలా చర్యలు తీసుకున్నాం’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
పిల్లలకు ఆస్తులు పంచిన టీమిండియా మాజీ క్రికెటర్
పాకిస్థాన్ యువ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డు