అహ్మదాబాద్లో ఐసీసీ సమావేశం.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీ వస్తాడా?
ABN , Publish Date - May 16 , 2026 | 05:08 PM
రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు భారత్లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి అహ్మదాబాద్ వేదిక కానుంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరుపై మాత్రం సందిగ్ధత నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్కు అహ్మదాబాద్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ ఓ కీలక సమావేశం కూడా అక్కడే జరగనుంది. రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు భారత్లో జరగనున్నాయి. దీనికి అహ్మదాబాద్ వేదిక కానుంది. మే 21న చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 30-31 తేదీల్లో ఐసీసీ బోర్డు ప్రత్యక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ క్రికెట్ బోర్డుల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరుపై మాత్రం సందిగ్ధత నెలకొంది.
వాస్తవానికి ఈ సమావేశాలను మార్చి లేదా ఏప్రిల్లో ఖతార్లో నిర్వహించాలని భావించారు. కానీ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వాయిదా వేశారు. అనంతరం దీనిని అహ్మదాబాద్కు మార్చారు. భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినండతో నఖ్వీ అహ్మదాబాద్కు రాకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు కూడా నఖ్వీకి ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పీసీబీ ఛైర్మన్గా నఖ్వీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బీసీసీఐతో మంచి సంబంధాలు లేవు. ఆసియా కప్ నాటి నుంచి బీసీసీఐ, పీసీబీ మధ్య పలు అంశాల్లో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అహ్మదాబాద్లో జరిగే ఐసీసీ మీటింగ్కు నఖ్వీ హాజరవుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
థాయ్లాండ్ ఓపెన్: ఫైనల్కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి