ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jun 03 , 2026 | 03:55 PM
ఆస్ట్రేలియా స్టార్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాను తదుపరి ఐపీఎల్కు అందుబాటులో ఉండకపోవచ్చని కమిన్స్ సూచించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ చక్కటి ప్రదర్శన చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో తదుపరి సీజన్ కోసం తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ప్రారంభించింది. అయితే ఈ లోపే ఎస్ఆర్ హెచ్ జట్టుకు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కమిన్స్ స్వయంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఓ అంతర్జాతీయ మీడియాతో ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. 'వచ్చే ఏడాది నేను కచ్చితంగా ఒక టోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది. అయితే అది నా దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్లు లేదా వన్డే ప్రపంచకప్ మాత్రం కాదు. సమయం వచ్చినప్పుడు నేను నా ఐపీఎల్ ఫ్రాంచైజీతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే నేనే ఏ విషయాన్ని ధ్రువీకరించలేను, ఎందుకంటే పరిస్థితులు మారవచ్చు లేదా గాయాల బారిన పడవచ్చు' అని కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ కమిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలపై క్రికెట్ నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 2027 అత్యంత కీలకం కానుంది. ఆ ఏడాది ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్ 2027 ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్గా ఉన్న ప్యాట్ కమిన్స్.. దేశం తరఫున ఈ పెద్ద టోర్నమెంట్లన్నింటికీ అందుబాటులో ఉండటం కోసం ఐపీఎల్ 2027కు దూరం కావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ ఉద్దేశంతోనే పై వ్యాఖ్యలు చేశాడని క్రీడా నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..
అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ దూరం కానున్నాడా?