అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ దూరం కానున్నాడా?
ABN , Publish Date - Jun 03 , 2026 | 09:44 AM
భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఫిట్నెస్పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, హార్దిక్ను బీసీసీఐ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు హార్దిక్ మాత్రమే స్పందించినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. జూన్ 6 నుంచి 20వ తేదీ వరకు అఫ్గాన్తో టీమిండియా ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఫిట్నెస్పై బీసీసీఐ దృష్టి సారించింది. గాయాల బారిన పడిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వన్డే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఫిట్నెస్ ఆధారంగా తుది జట్టులో ఆడుతారా? లేదా? అని నిర్ణయిస్తామని బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, హార్దిక్ను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు హాజరు కావాలని బీసీసీఐ ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు హార్దిక్ మాత్రమే స్పందించినట్లు సమాచారం.
హార్దిక్ పాండ్య త్వరలోనే బెంగళూరుకు చేరుకుని వారం రోజులపాటు ఫిట్నెస్ పరీక్షలు, శిక్షణలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అనంతరం అఫ్గానిస్థాన్తో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టులో కలవనున్నాడు. రోహిత్ శర్మ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. హిట్మ్యాన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీనివల్ల ఐపీఎల్ 2026లో నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అఫ్గానిస్థాన్తో వన్డేలకు రోహిత్ ఎంపికైనప్పటికీ.. తన ఫిట్నెస్ను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ విఫలమైతే ఈ వన్డే సిరీస్కు దూరం కానున్నాడు. అతడికి బ్యాకప్గా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్లో ఉంచినట్లు తెలుస్తోంది.
అఫ్గాన్తో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ(ఫిట్నెస్ ఆధారంగా), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య(ఫిట్నెస్ ఆధారంగా), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రిసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె
ఇవి కూడా చదవండి:
మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ కైవసం
ప్రత్యర్థి జట్లకు వైభవ్ భయాన్ని పరిచయం చేశాడు: సచిన్ టెండూల్కర్