భారత టీ20 కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా!
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:30 PM
గంభీర్ తర్వాత టీ20 కోచ్ రేసులో ఎవరున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగిసింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు అఫ్గానిస్థాన్తో సిరీస్కు సిద్ధమవుతోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయవంతంగా దూసుకెళుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 2027 వన్డే ప్రపంచ కప్నకు కూడా భారత్ టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో గంభీర్ తర్వాత టీ20 కోచ్ రేసులో ఎవరున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్కు కోచ్గా ఉన్న ఆశిష్ నెహ్రా సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు.
‘ఆశిష్ నెహ్రా పూర్తిగా క్రికెట్పై దృష్టి పెట్టే వ్యక్తి. జట్టులోని సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకుని పరిష్కరించగలడు. జట్టును గెలిపించడం కోసం పరితపిస్తుంటాడు. ఇతరులను సంతోషపెట్టేందుకు రాజకీయాలు చేయడు. ఇదే విషయాన్ని ప్లేయర్లు కూడా గమనిస్తారు. అతడి నేతృత్వంలో జట్టు విజయం సాధించినా.. ఆ క్రెడిట్ ఎంతమాత్రం తీసుకోవడానికి ఇష్టపడడు. సాధారణ వ్యక్తిలా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు. భవిష్యత్తులో భారత టీ20 కోచ్ కోసం వెతకాల్సి వస్తే.. ఆశిష్ నెహ్రా అత్యుత్తమ ఎంపిక అవుతాడు. అతడి రికార్డు అద్భుతం. నెహ్రా జట్టులోకి వస్తే బౌలింగ్ కోచ్గా కాదు.. నేరుగా హెడ్ కోచ్గానే రావాలి. వేర్వేరు కెప్టెన్లతో జట్టును విజయవంతంగా నడిపించిన వ్యక్తికి అదే సరైన స్థానం’ అని సంజయ్ మంజ్రేకర్ వెల్లడించాడు.
ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్గా ఉన్న నెహ్రా.. జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఒకసారి ఛాంపియన్గా నిలవగా.. మరో రెండు సార్లు ఫైనల్కు చేరింది. మరోసారి ప్లే ఆఫ్స్ ఆడింది. ఈ విజయాల వెనుక నెహ్రా కీలక పాత్ర పోషించాడు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ నం.1 కార్ల్సన్కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ దూరం కానున్నాడా?