Share News

ప్రపంచ నం.1 కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద

ABN , Publish Date - Jun 03 , 2026 | 10:30 AM

భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ నంబర్ వన్ చెస్ దిగ్గజం మాగ్నెస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. నార్వే చెస్ 2026 టోర్నీలో క్లాసికల్ విభాగంలో కార్ల్‌సన్‌ను రెండోసారి ఓడించి చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ నం.1 కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
R Praggnanandhaa

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ నంబర్ వన్ చెస్ దిగ్గజం మాగ్నెస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. నార్వే చెస్ 2026 టోర్నీలో క్లాసికల్ విభాగంలో కార్ల్‌సన్‌ను రెండోసారి ఓడించి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు క్లాసికల్ గేమ్‌లో ఓడించిన తొలి భారత ప్లేయర్‌గా ప్రజ్ఞానంద అరుదైన ఘనత సాధించాడు.


స్వదేశంలో వరుసగా రెండోసారి ఓటమి చవిచూడటంతో కార్ల్‌సన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజ్ఞానందతో కరచాలనం చేసి.. నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా విజయంతో ప్రజ్ఞానంద 12 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకి నార్వే చెస్ టైటిల్‌కు అత్యంత చేరువలో నిలిచాడు. మరోవైపు టోర్నీలో ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉన్నప్పటికీ.. డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల్‌సన్ టైటిల్ రేసులో వెనకపడ్డాడు. ఈ టోర్నీలో కార్ల్‌సన్ ఇప్పటివరకు నాలుగు క్లాసికల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. అందులో రెండు ఓటములు ప్రజ్ఞానంద చేతిలోనే కావడం గమనార్హం.


నార్వే చెస్ 2026 టోర్నీ పట్టికలో అమెరికా గ్రాండ్ మాస్టర్ వేస్‌లీ సో 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్‌కు చెందిన మరో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌పై అలీరెజా క్లాసికల్ గేమ్‌లో గెలిచాడు. కాగా గుకేశ్‌కు ఇది టోర్నీలో మూడో క్లాసికల్ ఓటమి. ప్రస్తుతం అతడి ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా గరిష్ఠంగా 14 పాయింట్లకే చేరుకోగలడు. దీంతో టైటిల్ ఆశలు దాదాపు ముగిసినట్టే అయితే ప్రజ్ఞానందకు మాత్రం టైటిల్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. కార్ల్‌సన్‌ను అతడి సొంతగడ్డపై రెండుసార్లు ఓడించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇప్పుడు నార్వే చెస్ కిరీట పోరులో బలమైన పోటీదారుడిగా అవతరించాడు. కాగా చివరి రెండు రౌండ్లు ఉత్కంఠభరితంగా మారనున్నాయి.


ఇవి కూడా చదవండి:

మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ కైవసం

ప్రత్యర్థి జట్లకు వైభవ్ భయాన్ని పరిచయం చేశాడు: సచిన్ టెండూల్కర్

Updated Date - Jun 03 , 2026 | 10:40 AM