టీ20 ప్రపంచ కప్ 2026: యువరాజ్ రికార్డు సమం చేసిన ఇషాన్, హార్దిక్
ABN , Publish Date - Feb 27 , 2026 | 07:49 AM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య .. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026)లో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. సాధారణంగా మైదానంలో పరుగులు వరద పారుతుంది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం సిక్సర్లు వర్షం కురిసింది. టీమిండియా ఏకంగా 17 సిక్సర్లు బాది జింబాబ్వే(Zimbabwe) బౌలర్లను కోలుకోలేని దెబ్బ తీశారు. ఈ సిక్సర్ల పండగలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య .. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
చెపాక్ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన ఈ పోరులో ఇషాన్ కిషన్(Ishan Kishan), హార్దిక్ పాండ్య చెలరేగి ఆడారు. వీరిద్దరూ కలిసి 6 సిక్సర్లు బాదారు. దీంతో ఒక ఎడిషన్ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్గా ఉన్న యువరాజ్ సింగ్ రికార్డును వీరు సమం చేశారు. 2007లో యువరాజ్ సింగ్ 12 సిక్సర్లు కొట్టగా, తాజాగా ఈ 2026 పొట్టి ప్రపంచ కప్లో ఇషాన్, హార్దిక్ కూడా ఇప్పటివరకు 12 సిక్సర్లతో ఆ జాబితాలో చేరారు. ప్రస్తుత ఈ టోర్నీలో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లుగా వీరిద్దరే అగ్రస్థానంలో ఉన్నారు
కేవలం సిక్సర్లే కాకుండా, హార్దిక్ పాండ్య(Hardik Pandya) మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో నంబర్ 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక అర్ధ శతకాలు(5) చేసిన బ్యాటర్గా హార్దిక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా విధ్వంసకర ప్లేయర్ డేవిడ్ మిల్లర్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్లను వెనక్కి నెట్టి హార్దిక్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. మిల్లర్, మార్కస్ ఇప్పటి వరకు చెరో నాలుగు అర్ధ సెంచరీలు చేశారు. మొత్తంగా ఫినిషర్గా హార్దిక్ ఎంత ప్రమాదకరమో తాజా టోర్నీ గణాంకాలే నిరూపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: జింబాబ్వేతో కీలక పోరు.. టీమిండియా ఘన విజయం