Share News

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ABN , Publish Date - Aug 02 , 2026 | 07:16 PM

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప తీపి జ్ఞాపకమని, ప్రస్తుతం తనకు ఎలాంటి నిరాశా లేదా బాధ లేదని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఆదివారం నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో భువి పాల్గొన్నాడు.

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు:  భువనేశ్వర్
Bhuvneshwar Kumar

స్పోర్ట్స్ డెస్క్: భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప తీపి జ్ఞాపకమని, ప్రస్తుతం తనకు ఎలాంటి నిరాశా లేదా బాధ లేదని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఆదివారం నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న అతడు, తన కెరీర్, టీమిండియాలోకి తిరిగి వచ్చే అంశాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


'నేను ఇప్పటికే దేశం తరఫున ఆడాను. కాబట్టి కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. మరో అవకాశం వస్తే సంతోషమే. రాకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు. కేవలం ఆటపై ఉన్న మక్కువతోనే దేశవాళీ క్రికెట్, యూపీ టీ20 లీగ్ ఆడుతున్నాను. క్రీడల్లో తరం మారడం చాలా సాధారణ విషయం' అని భువి పేర్కొన్నాడు. తన ఇంట్లో క్రికెట్ గురించి గానీ, జట్టులో చోటు దక్కకపోవడం గురించి గానీ చర్చలు జరగవని, కుటుంబం ఇచ్చే మద్దతు వల్లనే తాను మానసికంగా ప్రశాంతంగా ఉన్నానని వెల్లడించాడు.


ఐపీఎల్ 2026లో 16 మ్యాచ్‌లలో 28 వికెట్లతో చెలరేగిన భువనేశ్వర్, భారత్‌లో పేస్ బౌలింగ్ విప్లవానికి ఐపీఎల్ తోపాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ రవిశాస్త్రిల ముందుచూపే కారణమని ప్రశంసించాడు. విదేశీ పర్యటనలకు ముందు స్వదేశీ పిచ్‌లను కూడా పేసర్లకు అనుకూలంగా రూపొందించి జట్టును సిద్ధం చేసిన విజన్ వారిదని గుర్తు చేసుకున్నాడు. అలాగే మీరట్ అకాడమీ రోజుల నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ, తన బౌలింగ్ శైలిపై మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ప్రభావం ఎంతో ఉందన్నాడు. ఆయన ఆటతీరును నిశితంగా గమనిస్తూ బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నానని భువనేశ్వర్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

భారత జట్టుకు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

Updated Date - Aug 02 , 2026 | 07:17 PM